INDW VS AUSW: తొలి వన్డేలో టీమిండియా చిత్తు.. ఆసీస్‌ రికార్డు విజయం

AUSW Vs INDW 1st ODI: Australia Cruise To 25th Straight Win, Beat India By 9 Wickets - Sakshi

మెక్‌కే: 3 వన్డేల సిరీస్‌లో భాగంగా హారప్‌ పార్క్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు చిత్తుగా ఓడిపోయింది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన మిథాలీ సేన నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేయగా..  ఆసీస్‌ మహిళా జట్టు మరో 9 ఓవర్లు  మిగిలుండగా ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌ రేచల్ హేన్స్ 93 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చగా.. మరో ఓపెనర్‌ అలైసా హీలీ (77 బంతుల్లో 77; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ మెగ్ లానింగ్ (69 బంతుల్లో 53 నాటౌట్;  7 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించారు. 

అంతకుముందు టీమిండియా ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. కెప్టెన్ మిథాలీ రాజ్ 107 బంతుల్లో 3 ఫోర్లతో 63 పరుగులు చేయగా.. యస్తికా భాటియా (51 బంతుల్లో 35;  2 ఫోర్లు), వికెట్ కీపర్ రిచా ఘోష్ (29 బంతుల్లో 32; 3 ఫోర్లు, సిక్స్‌), గోస్వామి (24 బంతుల్లో 20; ఫోర్‌, సిక్స్‌) ఓ మోస్తరుగా రాణించడంతో టీమిండియా ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆసీస్‌ బౌలర్లలో డార్సీ బ్రౌన్‌(4/33), మోలినెక్స్‌(2/ 39), డిర్లింగ్టన్‌(2/29) మిథాలీ సేనను దారుణంగా దెబ్బకొట్టారు. 4 వికెట్లతో చెలరేగిన డార్సీ బ్రౌన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా శుక్రవారం(సెప్టెంబర్‌ 24న) జరుగనుంది. 

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌తో పలు రికార్డులు నమోదయ్యాయి. వన్డేల్లో ఆస్ట్రేలియా వరుసగా 25వ విజయం సాధించి విజయాల పరంపరను కొనసాగించింది. మరోవైపు భారత కెప్టెన్‌ మిథాలీ రాజ్ తన కెరీర్‌లో 20 వేల పరుగులు పూర్తిచేసుకుంది. ఈ మ్యాచ్‌లో 63 పరుగులు చేసిన మిథాలీకి వన్డేల్లో ఇది వరుసగా ఐదో అర్ధ సెంచరీ కావడం విశేషం. అంతకుముందు ఇన్నింగ్స్‌ల్లో ఆమె 75 నాటౌట్, 59, 72, 79 పరుగులు చేసింది.
చదవండి: న్యూజిలాండ్‌ క్రికెట్ జ‌ట్టుకు బాంబు బెదిరింపు..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top