17న న్యూఢిల్లీ, లక్నోలో నిర్వహణ
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్లు అమన్ సెహ్రావత్, అంతిమ్ పంఘాల్ ఆసియా చాంపియన్షిప్ కోసం నిర్వహించనున్న సెలక్షన్ ట్రయల్స్లో పోటీపడనున్నారు. అయితే పశ్చిమాసియా సంక్షోభ పరిస్థితులతో భారత బృందం అల్బేనియాలోనే చిక్కుకుపోవడంతో ట్రయల్స్ను వాయిదా వేశారు. ముందనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9, 10 తేదీల్లో ట్రయల్స్ జరగాల్సి ఉండగా... ఇప్పుడు దీన్ని మార్చి 17కు వాయిదా వేసినట్లు రెజ్లింగ్ సమాఖ్య వర్గాలు వెల్లడించాయి.
పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అమన్ పురుషుల 57 కేజీల కేటగిరీలో, ప్రపంచ చాంపియన్షిప్లో రెండుసార్లు కాంస్య పతకాలు నెగ్గిన అంతిమ్ పంఘాల్ మహిళల 53 కేజీల కేటగిరీలో పోటీపడతారు. నిజానికి అమన్ 61 కేజీల విభాగంలో, అంతిమ్ 55 కేజీల విభాగంలో పోటీపడేందుకు నమోదు చేసుకున్నారు.
ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ దాడులతో విమాన సర్వీసుల రద్దు, గల్ఫ్ గగన తలం మూసివేత కారణంగా అల్బేనియాలో రెండో ర్యాంకింగ్ సిరీస్లో పోటీపడేందుకు వెళ్లిన భారత జట్టు అక్కడే చిక్కుకుంది. జట్టు సభ్యుల రాక ఆలస్యం కావడంతో సెలక్షన్ ట్రయల్స్ను వారం రోజుల పాటు వాయిదా వేశారు. ఈ నెల 17న న్యూఢిల్లీ, లక్నోల్లో ట్రయల్స్ నిర్వహిస్తారు.


