
2026 ఆసియా క్రీడల్లో పోటీపడే క్రీడాకారులకు వసతి ఏర్పాటు
టోక్యో: కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు, ఒలింపిక్స్లాంటి మెగా ఈవెంట్లు జరిగితే ప్రపంచ వ్యాప్తంగా పాల్గొనే అంతర్జాతీయ అథ్లెట్ల కోసం ఆధునిక హంగులతో, సకల సౌకర్యాలతో క్రీడా గ్రామాన్ని నిర్మించడమేది ఆనవాయితీ. ఇప్పటి వరకు జరిగిన ప్రతీ మెగా ఈవెంట్లోనూ ఇదే జరిగింది. కానీ వచ్చే ఏడాది జపాన్ ఆతిథ్యమిచ్చే ఆసియా క్రీడల్లో మాత్రం క్రీడా గ్రామం కనిపించదు. దీని స్థానంలో ఫ్లోటింగ్ విలేజ్కు నిర్వాహకులు మొగ్గు చూపారు. అంటే నీటిపై తెలియాడే విలేజ్ అన్నమాట! ఇందుకోసం భారీ ఓడను వినయోగించనుంది.
క్రూజ్ షిప్ తెలుసుగా... అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ఓడ. నీటిపై కదలాడే నగరాన్ని తలపించే క్రూజ్షిప్లో ఏషియాడ్కు విచ్చేసే అథ్లెట్లకు బస కల్పించే ఏర్పాట్లను జపాన్ నిర్వాహకులు చేస్తున్నారు. వచ్చే ఏడాది సెపె్టంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే ఈ ఆసియా క్రీడల్లో ఆసియా దేశాలకు చెందిన 15 వేల మంది అథ్లెట్లు పాల్గొంటారు. వీరందరి బసకోసం రోటీన్గా క్రీడా గ్రామాన్ని నిర్మించకుండా క్రూజ్షిప్లోనే బస ఏర్పాట్లు చేయనున్నారు.
ఇదే జరిగితే అథ్లెట్లకు ఇదో సరికొత్త అనుభూతిని అందిస్తుంది. జపాన్లోని అయిచి రాష్ట్రంలోని నగోయా నగరంలో ఆసియా క్రీడలతో పాటు పారా ఆసియా క్రీడలు జరుగుతాయి. దీనికి సంబంధించిన ఆర్గనైజింగ్ కమిటీ నగోయా రేవు సమీపంలోని కింజో పీర్ వద్ద క్రూజ్షిప్ను ఫ్లోటింగ్ విలేజ్గా వాడుకోనుంది.
ఆర్చరీ, బాస్కెట్బాల్ 3్ఠ3, కనోయింగ్ –కయాకింగ్, సైక్లింగ్, మౌంటెన్ బైక్ సైక్లింగ్, రేసింగ్ ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్బాల్, జూడో, కబడ్డీ, కురాష్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, రోయింగ్, రగ్బీ, సెపక్తక్రా, స్పోర్ట్ క్లైంబింగ్, స్క్వాష్, టెన్నిస్, వెయిట్లిఫ్టింగ్, రెజ్లింగ్, వుషు తదితర పోటీల్లో పాల్గొనేందుకు 4600 మంది అథ్లెట్లు వస్తారని నిర్వాహకులు అంచనా వేశారు. ఈ 20 క్రీడాంశాలకు సంబంధించిన వేదికలన్నీ (స్టేడియాలు) కూడా నగోయా పోర్ట్కు అతి దగ్గరలోనే ఉండటంతో నిర్వాహకులు ఫ్లోటింగ్ విలేజ్ (క్రూజ్షిప్పై) వైపు మొగ్గినట్లు తెలిసింది.
ఇంతకు ముందెన్నడూ చూడని గ్రామాన్ని ఆవిష్కరించనున్నామని, ఇది అథ్లెట్ల జీవితాల్లో చిరకాలం నిలిచిపోయే వినూత్న వేదికని ఆసియా క్రీడల సాంకేతిక అధికారి ఒకరు తెలిపారు. భారీ ఓడలో కంటెయినర్లతో తయారు చేసిన విల్లాలు ఉంటాయి. అంతేకాదు జిమ్, స్విమ్మింగ్పూల్ సదుపాయలెన్నో ఉంటాయి.