పల్లెల్లో ‘ఇథనాల్’ చిచ్చు
చెరువులో చేపలు మృత్యువాత
ఇటీవల స్థానిక చెరువులో దాదాపు 8క్వింటాళ్ల చేపలు మృత్యువాత పడటం గ్రామాల్లో తీవ్ర కలకలం రేపింది. పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థజలాల వల్లే చేపలు చనిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..కలుషిత నీటిని తాగిన పశువులు కూడా మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. మనుషుల ఆరోగ్యంతోపాటు మూగజీవాల ప్రాణాలకూ ముప్పు ఏర్పడుతోందని ఆందోళన చెందుతున్నారు. సాగునీటి కాల్వల్లోకి వ్యర్థజలాలు చేరుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంట పొలాలకు వెళ్లాల్సిన నీరు కలుషితమైతే వ్యవసాయమే ప్రశ్నార్థకంగా మారుతుందని రైతులు అంటున్నారు. కలుషిత నీటితో పండించిన పంటలు ఆహారంగా ప్రజల ఇళ్లకు చేరితే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పంటలు దిగుబడి తగ్గడం ఒక సమస్య అయితే, కలుషిత నీటితో పండే ఆహార పంటల ప్రభావం మరో పెద్ద ముప్పుగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇథనాల్ పరిశ్రమలను తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు, రైతులు ఇప్పటికే పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. మండలం బంద్కు కూడా పిలుపునిచ్చారు. తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం కనిపించలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించి తమ భూములు, ప్రాణాలను కాపాడాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు.


