ఒకే వాహనంలో రఘునందన్రావు, కొత్త ప్రభాకర్రెడ్డి కలిసికట్టుగా వెళ్లి పలు ప్రారంభోత్సవాలు అవాకై ్కన బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు సర్వత్రా చర్చనీయాంశం
ఒకరిది బీజేపీ, మరొకరిది బీఆర్ఎస్.. వారి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో రాజకీయాలకు నెలవైన దుబ్బాకలో సోమవారం ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఎంపీ రఘునందన్రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఒకే వాహనంలో వెళ్లి పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
– దుబ్బాక
దుబ్బాక నియోజకవర్గం అంటేనే రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం.. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి(బీఆర్ఎస్), ఎంపీ మాధవనేని రఘునందన్రావు (బీజేపీ) ఉమ్మడి దుబ్బాక మండలానికి చెందిన వారే కావడం.. అందులో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పనులు చేపట్టాలన్నా అధికారులకు తీవ్ర తలనొప్పిగా తయారైంది. కొత్త ప్రభాకర్రెడ్డి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులతో హాజరుఅవుతుండగా రఘునందన్రావు సైతం పోటాపోటీగా పార్టీ క్యాడర్తో పాల్గొంటుండటం.. ఇరు పార్టీల క్యాడర్ నినాదాలతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం తెలిసిందే. నియోజకవర్గంలో ఏ కార్యక్రమమైనా వందలాది మంది పోలీసుల ముందస్తు బందోబస్తు మధ్యనే జరుగుతూవస్తోంది. కాని ఇదంతా గతం.. ప్రస్తుత సన్నివేశాలతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయా? అని పలువురు అంటున్నారు.
ఎంపీ, ఎమ్మెల్యే ఒకే కారులో...
భూంపల్లి–అక్బర్పేట మండలంలో జరిగిన పలు అభివృద్ధి పనులకు మాధవనేని రఘునందన్రావు, కొత్త ప్రభాకర్రెడ్డి ఒకే కారులో రావడం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. రామేశ్వరంపల్లిలో జరిగిన అభివృద్ధి పనుల్లో కలిసి పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే అనంతరం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సైతం అదే కారు ఎక్కడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ముందు సీటులో వెంకటయ్య ఉండగా వెనుక సీటులో రఘునందన్రావు, ప్రభాకర్రెడ్డి కూర్చొని భూంపల్లి మండల కేంద్రంలో జరిగిన అభివృద్ది పనులకు హాజరు కావడం విశేషం. అభివృద్ధి పనుల్లో సైతం పక్కపక్కనే ఉండి పాలుపంచుకోవడం ఒకరికొకరు కొబ్బరి కాయలు అందించుకోవడం ఆప్యాయంగా పలుకరించుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సోషల్ మీడియాలోనూ వీరి కలయిక చక్కర్లు కొట్టింది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమంటూ ఇరు పార్టీల నాయకులు సైతం మాట్లాడుకోవడం కనిపించింది.


