● 26 మండల కేంద్రాల్లో
కార్యక్రమాలకు స్పందన కరువు
● తొలిరోజు కొనుగోళ్లు 10క్వింటాళ్లలోపే
● జిల్లాలో పరిస్థితిపై పరిశీలన
ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో భాగంగా వ్యవసాయశాఖ తొలిరోజు సోమవారం చేపట్టిన ‘విత్తన మేళా’లు విఫలమయ్యాయి. జిల్లాలోని 26మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాలకు 154మంది మాత్రమే రైతులు హాజరయ్యారు. అన్ని రకాల విత్తనాలు కలుపుకొని 10క్వింటాళ్లలోపు మాత్రమే రైతులు కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంపై ‘సాక్షి’పరిశీలన.
గజ్వేల్: జిల్లాలో ఎల్నినో ప్రభావం తీవ్రంగా కనపడుతోంది. ఫలితంగా వర్షపాతం గణనీయంగా పడిపోయింది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 272.4మి.మీలు కురవాల్సి ఉండగా, ఇప్పటివరకు 185.9మి.మీలు మాత్రమే కురిసింది. ఈ లెక్కన 31.7% లోటు వర్షపాతం నమోదైంది. ఫలితంగా పంటల సాగు ముందుకుసాగటం లేదు. 5.41లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి వస్తాయని భావిస్తే ఇప్పటివరకు 50% కూడా పంటలు సాగులోకి రాలేదు. ప్రధానంగా వరి సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. పత్తి ఇప్పటివరకు 1,03,461ఎకరాలు, కందులు 6,549, మొక్కజొన్న 26,969, స్వీట్కార్న్ 909, సజ్జలు 55, పెసర్లు 158, చెరుకు 25, ఇతర పంటల 2,483ఎకరాల్లో సాగులోకి వచ్చాయి. 3.85లక్షల ఎకరాలకుపైగా సాగులోకి వస్తుందని భావించిన వరి కేవలం 1,10,637 ఎకరాలకే పరిమితమైంది. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా అన్ని రకాల పంటలు 2,51,372ఎకరాల్లో మాత్రమే సాగులోకి వచ్చాయి. దీనిబట్టి సాగు అంచనా 50%కూడా దాటలేదు.
రైతుల నుంచి స్పందన కరువు
ఈ నెల 27 నుంచి 29 వరకు జిల్లాలోని 26 మండల కేంద్రాల్లోని రైతు వేదికల వద్ద విత్తన మేళాలను నిర్వహించడానికి నిర్ణయించగా తొలిరోజు సోమవారం నిర్వహించిన శిబిరాలకు కనీస స్పందన కరువైంది. 25 మంది రైతులు 3.72క్వింటాళ్ల మొక్కజొన్న విత్తనం, అయిదుగురు రైతులు 20కిలోల స్వీట్కార్న్, 80మంది 4క్వింటాళ్ల కంది, 37మంది 1.5క్వింటాళ్ల కురగాయల విత్తనాలు, నలుగురు 20కిలోల పెసర్లు, ఇద్దరు 8కిలోల మినుమలు, మరొకరు 4కిలోల నువ్వుల విత్తనాలను కొనుగోలు చేశారు. మొత్తమ్మీద 10క్వింటాళ్లలోపు విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయగా...వీటిని కూడా వ్యవసాయాధికారులు అతికష్టమ్మీద రైతులచేత కొనుగోలు చేయించారు.
సబ్సీడీ లేకపోవడమే కారణం!
రైతులకు పంపిణీ చేస్తున్న విత్తనాలకు సబ్సిడీ ఇవ్వకపోవడం వల్లే విత్తన మేళాలకు స్పందన కరువైందని స్పష్టమవుతోంది. బహిరంగ మార్కెట్లో దొరికే విత్తనాలనే యథాతథంగా మేళాల్లో అందజేయడం ఏంటని, దీనికోసం ప్రత్యేకంగా హడావిడి చేయడం ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు.


