‘గిరి’ప్రదక్షిణం..వరుణయాగం సంపూర్ణం
నాచగిరిలో ఆధ్యాత్మిక వైభవం
పీఠాధిపతికి పూర్ణకుంభ స్వాగతం
వర్గల్(గజ్వేల్): శ్రీవారి జన్మనక్షత్రం..‘స్వాతి’నక్షత్ర మహోత్సవ వేళ నాచగిరి భక్తజన సందోహమైంది. నృసింహనామంతో శ్వేతగిరి మార్మోగింది. భక్తజన సామూహిక ‘గిరి’ప్రదక్షిణతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. బుధవారం ఉదయం పీఠాధిపతి శ్రీమాధవానందస్వామి ఉత్తరద్వారం వద్ద శ్రీలక్ష్మీనృసింహునికి హారతి సమర్పించి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. స్వామివారిని అనుసరిస్తూ ఆలయ ఈఓ రంగాచారి, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, మాజీ చైర్మన్ రవీందర్గుప్తా, వేలాదిగా భక్తజన పరివారం ముందుకుసాగారు. గోవిందుని స్మరిస్తూ, గిరిని చుడుతూ, హరిద్రతీరం మీదుగా గిరిని చుట్టి ఆలయానికి చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని పునీతులయ్యారు.
వరుణయాగం సంపూర్ణం
నాచగిరి సందర్శించిన పీఠాధిపతికి ఆలయ ప్రధానార్చకులు జగన్నాథాచార్యులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని, వరుణయాగంలో పాల్గొన్నారు. మూడురోజులపాటు కొనసాగిన వరుణయాగం పూర్ణాహుతితో ముగిసింది. వేడుకలో భక్తులు భారీగా పాల్గొన్నారు.


