భోజనం.. మరింత నాణ్యం
ముద్ద అన్నానికి గుడ్బై ప్రతి నెలా 5,500 క్వింటాళ్ల బియ్యం అవసరం వచ్చే నెల నుంచి అందించేందుకు సన్నాహాలు
స్కూళ్లకు, హాస్టళ్లకు ఇక స్టీమ్రైస్
మధ్యాహ్న భోజన పథకంలో సర్కారు కీలక మార్పులు చేసింది. సన్న బియ్యంతో అన్నం ముద్దగా అవుతుండటం.. విద్యార్థుల నుంచి కూడా ఫిర్యాదులు వస్తుండటంతో ఇకపై స్టీమ్ రైస్ (ఆవిరి బియ్యం)ను సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలలో అందించే భోజనం కోసం ఇకపై స్టీమ్ రైస్ను అందించనున్నారు. – సాక్షి, సిద్దిపేట
ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టళ్లు, అంగన్ వాడీలకు సన్నబియ్యమే అయినా కొత్త బియ్యం కావడంతో వండిన తర్వాత ముద్దగా మారుతోంది. కొత్త బియ్యంలో తేమ శాతం ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అన్నం ముద్దగా తయారై మెత్తబడి పోతుండటంతో పిల్లలు సంపూర్ణంగా భోజనం చేయలేకపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసేవారు ఇంటి దగ్గరి నుంచి బాక్స్లు తెచ్చుకుంటున్నారు. కానీ ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే వారు ఒక రోజు తినడం.. మరో రోజు తినకుండా ఉండటంతో అప్పుడప్పుడు అస్వస్థతకు గురవుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని స్టీమ్ రైస్ను అందించాలని నిర్ణయించారు. దీంతో జిల్లాకు ప్రతి నెలా 5,500 క్వింటాళ్ల బియ్యం అవసరం ఉండనుంది.
జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా 2,308 విద్యా కేంద్రాల్లో చదువుతున్న విద్యార్థులకు 5,500 క్వింటాళ్ల సన్న బియ్యాని సరఫరా చేస్తున్నారు. అందులో 1,002 ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి 1,800 క్వింటాళ్లు, 156 వివిధ సంక్షేమ హాస్టల్స్కు 3,000 క్వింటాళ్ల, 1,150 అంగన్ వాడీ కేంద్రాలకు 700 క్వింటాళ్ల బియ్యం ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఇక స్టీమ్ రైస్ సరఫరా కోసం మిల్లర్లకు ఇండెంట్ను ఇచ్చారు.
ఇక పొడిపొడిగా..
విద్యార్థుల కోసం పాఠశాలలు, హాస్టళ్లలో ఎంత జాగ్రత్తగా వండినా కొత్త బియ్యం కావడంతో మెత్తగా అయ్యేది. ఇక స్టీమ్ రైస్తో వండితే అన్నం ముద్ద కాదు. అలాగే పొడిపొడిగా ఉంటుంది. తినడానికి అనువుగా ఉంటుంది. తినేందుకు విద్యార్థులకు.. వండేందుకు వంట కార్మికులకు ఇబ్బందులు తప్పనున్నాయి.
మిల్లర్లకు ఇండెంట్ ఇస్తున్నాం
పాఠశాలు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు స్టీమ్ రైస్ సరఫరా చేయా లని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మిల్లర్లకు స్టీమ్ రైస్ను అందించేందుకు ఇండెంట్లను అందజేస్తున్నాం. వచ్చే నెల నుంచి అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం.
– ప్రవీణ్, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్


