3,887 ఎకరాల్లో పంట నష్టం
అకాల వర్షంతో రైతన్న ఆగం
● తొగుటలో అత్యధికంగా దెబ్బతిన్న పంటలు ● ప్రాథమిక అంచనాకు వచ్చిన వ్యవసాయశాఖ
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలో కురిసిన అకాల వర్షం రైతులను ఆగం చేసింది. ఈ యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 3,55,501 ఎకరాల్లో వరి, 33,143 ఎకరాల్లో మొక్కజొన్న, 347 ఎకరాల్లో వేరుశనగ, 9,846 ఎకరాల్లో ప్రొద్దుతిరుగుడు, 1,724 ఎకరాల్లో శనగ పంటలను సాగు చేశారు. జిల్లాలో సోమవారం ఈదురుగాలులతో వర్షం కురవడంతో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలు దెబ్బతిన్నాయి. తొగుట, మిరుదొడ్డి, రాయిపోల్, దౌల్తాబాద్, సిద్దిపేట, దుబ్బాక, నంగునూరు, చేర్యాల, గజ్వేల్ మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా తొగుట మండలంలో 602 ఎకరాల్లో మొక్కజొన్న, 811 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, రాయిపోల్ మండలంలో 608 ఎకరాల్లో మొక్కజొన్న, 352 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, మిరుదొడ్డి మండలంలో 664 ఎకరాల్లో మొక్కజొన్న, 155 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, దౌల్తాబాద్ మండలంలో 231 ఎకరాల్లో మొక్కజొన్న, 181 ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,356 ఎకరాల్లో మొక్కజొన్న, 1531 ఎకరాల్లో ప్రొద్దుతిరుగుడు పంటలు మొత్తంగా 3,881 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి తొగుట, మిరుదొడ్డి మండలాల్లోని దెబ్బతిన్న పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మండలాల వ్యవసాయశాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు ప్రతి గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్ట వివరాలను సేకరించారు.
పంటల పరిశీలన
మిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలోని పలు గ్రామాల్లో కురిసిన వడగళ్లతో నష్టపోయిన పంటలను మంగళవారం జిల్లా వ్యవసాయ అధికారులు స్వరూపా రాణి, దుబ్బాక ఏడీఎ మల్లయ్యతో పాటు, దుబ్బాక కాంగ్రెస్ ఇన్చార్జి చెరుకు ముత్యం రెడ్డి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రాథమికంగా అందెలో 280 ఎకరాలు, కొండాపూర్లో 88, మిరుదొడ్డి 373, ధర్మారంలో 53 ఎకరాల్లో మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, కూరయాల పంటలు నష్టపోయినట్లు అంచనా వేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ పంటల నష్టాన్ని నిర్థారణ చే సి ప్రభుత్వానికి తుది నివేదికలు అందజేస్తామని తెలిపారు.
పంట నష్టం అంచనా వేశాం
జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పలు మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,356 ఎకరాల్లో మొక్కజొన్న, 1531 ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చాం. అత్యధికంగా తొగుట మండలంలో పంటలు దెబ్బతిన్నాయి. మంగళవారం ఉదయం నుంచే క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి పంట నష్ట వివరాలను సేకరించారు. –స్వరూపరాణి,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి


