గృహ నిర్మాణాల్లో వేగం పెంచాలి
● కలెక్టర్ హైమావతి ● ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సమీక్ష
దుబ్బాక: జిల్లాలోని అన్ని మండలాల్లో ఇందిరమ్మ గృహ నిర్మాణాలను వేగిరం చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం దుబ్బాక మండలం బల్వంతాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో 45 ఇళ్లు మంజూరు కాగా కేవలం 15 మాత్రమే గ్రౌండింగ్కావడంపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే లబ్ధిదారులతో మాట్లాడి నిర్మించుకోవడానికి సుముఖంగా లేనివారి నుంచి లెటర్ తీసుకొని డిలీట్ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం దుబ్బాక, భూంపల్లి–అక్బర్పేట మండల కార్యాలయాల్లో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై అధికారులతో సమీక్షించారు.
మండలంలోని హబ్షీపూర్ జెడ్పీహెచ్ఎస్, మండల పరిషత్ పాఠశాలలను సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటలను పరిశీలించి కూరలు పలుచగా ఉండడం చూసి అసహనం వ్యక్తం చేశారు. అన్ని పాఠశాలల్లో వంటలు నాణ్యతగా రుచికరంగా ఉండకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థుల హాజరు ప్రకారం ఆహార పదార్థాలు వండాలని సూచించారు. అలాగే గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు.


