
ట్రిపుల్ఆర్.. ఐదు ప్యాకేజీలు
వివరాలు 8లో
న్యూస్రీల్
ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2025
30 కిలోమీటర్లకు ఒకటి..
● పూర్తి కావొస్తున్న త్రీడీ, త్రీజీ నోటిఫికేషన్లు ● త్వరలో పనుల ప్రారంభానికి సన్నాహాలు
ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం పనుల అంశం కొలిక్కి వచ్చింది. 161.518 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఈ పనులను ఐదు ప్యాకేజీలుగా విభజించినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం త్రీడీ నోటిఫికేషన్ పూర్తికాగా, త్రీజీ కూడా తుది దశకు చేరుకోబోతుంది. ఈ క్రమంలోనే పరిహారం పంపిణీ చేపట్టడానికి రంగం సిద్ధమైంది. పనిలో పనిగా టెండర్ ప్రక్రియను సైతం వేగిరం చేసి పనులు ప్రారంభించడానికి సంబంధిత యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. – గజ్వేల్
ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం పనులు ఎలా చేపట్టాలనే అంశంపై సుదీర్ఘ కసరత్తు చేసిన అధికారులు చివరకు ఐదు ప్యాకేజీలుగా చేపట్టడానికి నిర్ణయానికి వచ్చారు. ప్యాకేజీగా 30 కిలోమీటర్కు పైగా విభజించి పనులు చేపట్టే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. 161.518 కిలోమీటర్ల మేర పనులు జరగనుండగా, ఇందులో 100 కిలోమీటర్లపైగా నిడివి ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఉంది. ఈ క్రమంలోనే మూడు ప్యాకేజీల పనులు ఇక్కడ జరుగను న్నాయి. మరో ముఖ్య విషయమేమిటంటే గజ్వేల్ కేంద్రంగా ఏర్పాటు చేసిన నేషనల్ హైవే ఆథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) కార్యాలయం ఈ పనులను పూర్తిస్థాయిలో పర్యవేక్షించనుంది.
పరిహారం పంపిణీకి సన్నాహాలు
భూసేకరణ కోసం ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని రెవెన్యూ డివిజన్ల వారీగా కాలా (కాంపీటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ అక్వాజైషన్)లు పనిచేస్తున్న సంగతి తెల్సిందే. చౌటుప్పల్, యాదాద్రి– భువనగిరి, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, ఆందోల్–జోగిపేట, సంగారెడ్డి కాలాల పరిధిలోని 84 గ్రామాల్లో త్రీడీ నోటిఫికేషన్లో భాగంగా 4,832.5 ఎకరాల వరకు భూసేకరణ లక్ష్యంగా ఉండగా, ఇందులో 4,747.5 ఎకరాలను సేకరించారు. ఈ లెక్కన 98 శాతం భూసేకరణ పూర్తయ్యింది. త్రీజీ నోటిఫికేషన్లో పరిహారం పంపిణీకి సంబంధించిన అంశంపై కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకు 86 శాతం ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పరిహారం పంపిణీకి త్వరలోనే చర్యలు చేపట్టబోతున్నారు. పరిహారం పంపిణీ తర్వాత భూములు స్వాధీనం చేసుకోవడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. దీని తర్వాత టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులను సైతం ప్రారంభించే ఆలోచనతో ఉన్నారు.
ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం మ్యాపు
అటవీశాఖకు భూముల అప్పగింత పూర్తి
ట్రిపుల్ఆర్ కోసం సేకరిస్తున్న భూమిలో 180 ఎకరాల అటవీ భూమి ఉంది. ఇందులో భాగంగానే ప్రత్యేకించి గజ్వేల్లోనే 70 ఎకరాల భూమిని అటవీశాఖ కోల్పోతుంది. ఈ భూమికి బదులుగా మహబూబాబాద్లో 180 ఎకరాల భూములను అటవీశాఖకు కేటాయించారు. ఈ భూముల అప్పగింతను అధికారికంగా పూర్తి చేశారు. ఇకపోతే మరో 650 ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం ట్రిపుల్ఆర్ కోసం సేకరిస్తున్నారు.
మరికొన్ని నెలల్లో ప్రారంభిస్తాం
ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం పనులను మరికొన్ని నెలల్లో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పనులను ఐదు ప్యాకేజీలుగా చేపట్టాలని నిర్ణయించాం. త్రీడీ నోటిఫికేషన్ పూర్తయ్యింది. త్రీజీ కూడా త్వరలోనే పూర్తి కానుంది. కాలాల ఆధ్వర్యంలో పరిహారం పంపిణీ కూడా జరుగనుంది. దీని తర్వాత పనులు ప్రారంభం కానున్నాయి.
– మాధవి,
ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్, గజ్వేల్