
రజతోత్సవం.. సమాయత్తం
బీఆర్ఎస్ సభకు భారీ సన్నాహాలు
● గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం
● ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 2లక్షల మందిని తరలించేందుకు కసరత్తు
● సమీక్షలు, టెలికాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్న హరీశ్రావు
● సిద్దిపేట నుంచి పాదయాత్రగా యువత
సాక్షి, సిద్దిపేట: బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు మెతుకుసీమ గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ (టీఆర్ఎస్) 24 ఏళ్లు పూర్తి చేసుకుని ఈ నెల 27న 25వ ఏటా అడుగుపెడుతున్న సందర్భంగా హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో రజతోత్సవ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఉమ్మడి మెదక్ జిల్లా భారీ సంఖ్యలో నాయకులను, కార్యకర్తలను తరలించేందుకు సమాయత్తం మవుతున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలను నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సమీక్షలను, టెలికాన్ఫరెన్స్లను నిర్వహిస్తూ కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి భారీగా తరలివెళ్లి ఉద్యమాల గడ్డగా మరోమారు సత్తా చాటేందుకు స్థానిక గులాబీ నేతలు ప్రత్యేక దృష్టి పెట్టారు.
ముమ్మరంగా ఏర్పాట్లు
ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి దాదాపు 2లక్షల మందికి పైగా సభకు వెళ్లేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సన్నాహక సమావేశం నిర్వహించారు. నాయకులకు పలు బాధ్యతలను అప్పగించారు. గజ్వేల్ నుంచి గులాబీ దండును తరలించే పనిలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ప్రతాప్రెడ్డి, మాదాసు శ్రీనివాస్లు దృష్టి సారించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించారు. సభకు తరలేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోనే సభ జరుగుతుండటంతో ఎక్కువ మందిని తరలించేందుకు ప్రత్యేక దృష్టిపెట్టారు. అలాగే మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్, పటాన్చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్ నుంచి సైతం జన సమీకరణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
నాయకుల కూలి పనులు
సభకు వెళ్లేందుకు తోవ ఖర్చుల (భోజనం, వాటర్ ప్యాకెట్ల) కోసం గులాబీ నాయకులు కూలీ పనులు చేస్తున్నారు. బీఆర్ఎస్, బీఆర్ఎస్ యువజన, బీఆర్ఎస్వీ నాయకులు పలు చోట్ల కూలీ పనులు చేసి డబ్బులను సమకూరుస్తున్నారు. అలాగే పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభకు వెళ్లేందుకు ఖర్చుల కోసం డబ్బులను విరాళంగా ఇస్తున్నారు.
రేపు పాదయాత్ర ప్రారంభం
ఎల్కతుర్తిలో జరగనున్న సభకు శుక్రవారం పాదయాత్రగా బయలు దేరి వెళ్లనున్నారు. సిద్దిపేటలోని రంగధాంపల్లి చౌరస్తా అమరవీరుల స్తూపం నుంచి దాదాపు వెయ్యి మంది యువత, విద్యార్థులు పాదయాత్రగా బయలుదేరనున్నారు. 27న సాయంత్రం ఎల్కతుర్తిలో జరిగే సభకు చేరుకోనున్నారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీని హరీశ్రావు నియమించారు. ఈ కమిటీ ఇప్పటికే హాల్టింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామం నుంచి 10 నుంచి 15 మంది పాదయాత్రగా వెళ్లేందుకు యువత ముందుకు వచ్చారు. ఇప్పటికే జాబితాను రూపొందించారు.
తరలివెళ్దాం రండీ..
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి
దుబ్బాక: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం స్థానికంగా సభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం కోసం జరిగిన ఉద్యమంలో దుబ్బాక నియోజకవర్గం క్రీయాశీలక పాత్ర పోషించిందన్నారు. కనీవిని ఎరుగని స్థాయిలో జరుగనున్న రజతోత్సవ సభకు నియోజకవర్గం నుంచి 15 వేలకు పైగా క్రీయాశీలక కార్యకర్తలు హాజరవుతారన్నారు. సభకు సంబంధించి ఇప్పటికే నియోజకవర్గంలోని కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి తగిన ఏర్పాట్లపై చర్చించామన్నారు కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జోరుగా వాల్ రైటింగ్
ఎల్కతుర్తి సభను విజయవంతం చేయాలని కోరుతూ పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రధాన రహదారుల వెంట వాల్రైటింగ్ రాయించారు. అలాగే పలువురు బీఆర్ఎస్ నేతలు వాల్ పోస్టర్లను రూపొందించి అతికించారు. స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లుగా పోటీ చేయాలనుకునే నాయకుల సభను విజయవంతం చేయాలని వాల్రైటింగ్లు, వాల్ పోస్టర్లు అంటించి తమ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు.

రజతోత్సవం.. సమాయత్తం

రజతోత్సవం.. సమాయత్తం

రజతోత్సవం.. సమాయత్తం