
కరెంట్ ఫెన్సింగ్ తీగే మృత్యుపాశమై..
వర్గల్(గజ్వేల్): పందుల బెడద నుంచి పైరును కాపాడేందుకు ఏర్పాటు చేసిన కరెంట్ ఫెన్సింగ్ తీగే ఆ రైతు పాలిట మృత్యుపాశమైంది. విద్యుదాఘాతంతో పైరుకు నీరు పారిస్తున్న కౌలు రైతు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన సోమవారం సాయంత్రం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మజీద్పల్లిలో చోటు చేసుకుంది. బేగంపేట ఎస్ఐ మహిపాల్రెడ్డి, గ్రామస్తుల కథనం ప్రకారం.. వర్గల్ మండలం దండుపల్లికి చెందిన నీల స్వామి(40) మజీద్పల్లిలో కొంత పొలం కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేశాడు. పందుల బెడద నుంచి పంట కాపాడుకునేందుకు చుట్టూరా కరెంట్ ఫెన్సింగ్ తీగ ఏర్పాటు చేశాడు. సోమవారం ఉదయం పొలంలో నీరు పారించేందుకు వెళ్తున్నట్లు భార్య శ్యామలకు చెప్పి వెళ్లాడు. మధ్యాహ్నం భోజనానికి రాలేదు. కుమారుడు రాజు పలుమార్లు తండ్రికి ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదు. దీంతో పొలం వద్దకు వెళ్లి వెతికాడు. అక్కడ ప్రమాదవశాత్తు కరెంట్ ఫెన్సింగ్ తీగను తగిలి విద్యుత్ షాక్కు గురై పొలంలోనే చనిపోయి కనిపించాడు. మృతుడి కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించామని ఎస్ఐ పేర్కొన్నారు.
విద్యుదాఘాతంతో కౌలు రైతు దుర్మరణం
వర్గల్ మండలం మజీద్పల్లిలో ఘటన