సాక్షి, సిద్దిపేట: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం చేర్పులు, మార్పులతో నూతన ఓటు నమోదు కార్యక్రమం చేపట్టింది. అక్టోబర్ 4న ఓటరు జాబితాను ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి అక్టోబర్ 31 వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తులను స్వీకరించారు. నవంబర్ 8వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇటీవల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. నాలుగు నియోజకవర్గాల్లో 28 రోజుల్లో 23,271 మంది దరఖాస్తు చేసుకోగా కొత్త ఓటర్లకు అవకాశం కల్పించారు. అందులో హుస్నాబాద్లో 5,607, సిద్దిపేటలో 5,210, దుబ్బాకలో 3,436, గజ్వేల్లో 9,018 మంది కొత్త ఓటర్లు ఉన్నారు.
తలరాతను మార్చేది వీరే..
నేతల తలరాతలు మార్చే అవకాశం మహిళల చేతుల్లోనే ఉంది. నాలుగు నియోజకవర్గాల్లో 9,48,669 ఉండగా అందులో పురుషులు 4,68,422, మహిళలు 4,80,166, ఇతరులు 81 ఉన్నారు. నాలుగు నియోజకవర్గాల్లో గజ్వేల్లోనే ఓటర్లు అధికంగా ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 11,744 మంది ఎక్కువగా ఉన్నారు.
అవకాశం కల్పించని ప్రధాన పార్టీలు
నాలుగు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నప్పటికీ ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు మహిళా అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ నెల 3 నుంచి10వ తేదీ వరకు ఆయా నియోజకవర్గాల్లో ఆర్ఓ కేంద్రాల్లో నామినేషన్లను స్వీకరించారు. దీంతో పలువురు మహిళలు పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చారు. ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లుగా పలువురు మహిళలు నామినేషన్లు వేశారు. దుబ్బాక నుంచి ముగ్గురు, గజ్వేల్ నుంచి 23 మంది మహిళలు, సిద్దిపేట నుంచి ఒక్క మహిళ నామినేషన్ వేశారు. హుస్నాబాద్ నుంచి ఒక్క మహిళ సైతం నామినేషన్ వేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment