● గరుడాళ్వారుపై లక్ష్మీనృసింహుని దివ్యదర్శనం
● నాచగిరిలో భక్తిపారవశ్యం
బ్రహ్మోత్సవ వైభవంతో నాచగిరి అలరారుతోంది. శనివారం రాత్రి లక్ష్మీనృసింహుని పెద్దగరుడోత్సవసేవ నేత్రపర్వం చేసింది. ఆలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్గుప్తా, ఈఓ బెల్లంకొండ రంగాచారి పర్యవేక్షణలో అర్చకులు మొదట విష్ణుమూర్తి ప్రతినిధి, వేద స్వరూపుడైన గరుత్మంతుడిని పట్టువస్త్రాలు, వివిధ రకాల పూలమాలికలతో కమనీయంగా అలంకరించారు. విశేషపూజలు చేశారు. లక్ష్మీ నారసింహులకు దంపతి సేవ, సభామండపంలో సదస్యం నిర్వహించారు. అనంతరం విశేషాలంకృతులైన లక్ష్మీసమేత స్వామివారు గరుడ వాహనాసీనులై పురవీధులలో ఊరేగుతూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. నేత్రపర్వంగా సాగిన గరుడోత్సవంలో భక్తులు పాల్గొని తరించారు.
–వర్గల్(గజ్వేల్)


