పౌల్ట్రీలో పేరుకున్న గుడ్ల నిల్వలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో 80కి పైగా పౌల్ట్రీఫాంలు ఉన్నాయి. అందులో 75లక్షల కోళ్లు ఉన్నాయి. జిల్లా నుంచి యూఏఈ, ఓమన్, ఖతార్ వంటి దేశాలకు దాదాపు 20లక్షలకు పైగా గుడ్లు ఎగుమతి అవుతుంటాయి. యుద్ధం ప్రారంభమైన మరుసటి రోజు నుంచే ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. మన ప్రాంతాల్లో సాధారణంగా చలికాలంలో అధికంగా వినియోగం ఉంటుంది. వేసవి కాలంలో కాస్త తగ్గుతుంది. ఈ సీజన్లో ధర పడిపోవడం, గుడ్ల ఉత్పత్తి తగ్గడం సాధారణమే అయినా ఎగుమతులు నిలిచిపోవడంతో ధర మరింత క్షీణించడానికి కారణమైంది.
పౌల్ట్రీ రైతు యుద్ధం ఎఫెక్ట్తో తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక్కో కోడిగుడ్డుపై దాదాపు రూ.1.75 నష్టం వాటిల్లుతోంది. దీంతో రోజుకు రూ.1.13కోట్ల నష్టం చవిస్తున్నారు. పెట్టిన పెట్టుబడి రాక.. కోడి గుడ్లు సకాలంలో అమ్ముడు పోకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
కుళ్లిపోతున్నాయి..
కోడిగుడ్లు సాధారణంగా చలి, వర్షాకాలంలో 25 రోజుల పాటు నిల్వ ఉంచవచ్చు. అదే ఎండాకాలంలో దాదాపు 18 రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. ఎగుమతులు నిలిచిపోవడంతో కొన్ని పౌల్ట్రీలలో గుడ్ల స్టాక్ పెరిగిపోతోంది. ఎండాకాలం కావడంతో కుళ్లిపోతున్నాయి. దీంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరి కొన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే మరింత నష్టం తప్పదని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతున్నారు. కోళ్లకు అందించే ఫీడింగ్ పై జీఎస్టీని ఎత్తివేయాలని, అలాగే విద్యుత్కు సబ్సిడీ ఇవ్వాలంటున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇలా..
గుడ్డు పెట్టే కోళ్లు: 75లక్షలు
రోజూ ఉత్పత్తి అయ్యే గుడ్లు: 65లక్షలు
గుడ్డుకు సగటున ఖర్చు: రూ. 5.50
ప్రస్తుతం ధర రూ.3.75 నుంచి రూ. 4.10
ఒక్కో గుడ్డుపై రూ. 1.75 నష్టం


