● జిల్లాలో ఎస్ఐఆర్ వార్డు, గ్రామ సభల నిర్వహణ ● 4.51 లక్షల మందికి నోటీసులు జారీ షురూ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో మరో కీలక ఘట్టానికి గురువారం తెరలేచింది. జిల్లావ్యాప్తంగా గ్రామసభలు, వార్డు సభలను నిర్వహించారు. ఈ సభలో ముసాయిదా ఓటరు జాబితా వివరాలను బీఎల్ఓలు ప్రకటించారు. అభ్యంతరాలను నేటి నుంచి స్వీకరించనున్నారు. జిల్లాలో మొత్తం 14.57 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ.. డిజిటలైజేషన్.. మ్యాపింగ్ ప్రక్రియ నిర్వహించిన అనంతరం 11.59 లక్షల మంది ఓటర్లతో కూడిన ముసాయిదా ఓటరు జాబితాను ఇటీవల ప్రకటించిన విషయం విధితమే.
4.51 లక్షల మందికి నోటీసులు
ముసాయిదా ఓటరు జాబితాలో ఉన్న 11.59 మంది ఓటర్లలో అసాధారణ (అనామలిస్) ఓటర్లు 3.47 లక్షల మంది ఉన్నట్లు బీఎల్ఓలు గుర్తించారు. పేరు, తండ్రి పేరు, వయస్సు.. తండ్రి వయస్సు.. ఇలా వివిధ అంశాల్లో తేడాలున్న ఓటర్లను అసాధారణ ఓటర్లుగా తేల్చారు. వీరితో పాటుగా మ్యాపింగ్ జరగని 1.12 లక్షల మంది ఓటర్లకు కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. ఇలా మొత్తం 4.60 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇందులో 4.51 లక్షల మందికి ఇప్పటికే నోటీసులు జనరేట్ అయ్యాయి. ఇందులో 44,149 మంది ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఇంకా 4.07 లక్షల మందికి నోటీసులు అందాల్సి ఉంది.
పటాన్చెరులో సాంకేతిక సమస్యలు
పటాన్చెరు నియోజకవర్గంలో సుమారు తొమ్మిది వేల మంది అనామలసిస్ ఓటర్లకు నోటీసులు జనరేట్ కావాల్సి ఉంది. సాంకేతిక కారణాలు, కొన్ని చోట్ల కొత్త వారు బీఎల్ఓలుగా ఉండటం.. తదితర కారణాలతో ఈ నోటీసుల జనరేట్ ఆలస్యమవుతోంది. ఈ నోటీసులు అందుకున్న ఓటర్లు ఆ నోటీసుల్లో పేర్కొన్న అభ్యంతరాలకు సంబంధించిన ఆధారాలను బీఎల్ఓలకు చూపాల్సి ఉంటుంది. సరైన ఆదారాలు చూపిన వారికి మాత్రమే ఓటరు జాబితాలో చోటు దక్కుతుంది.
యువ ఓటర్లు రెండు రుజులివ్వాల్సిందే..
ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న వారు 1987 జూలై కంటే ముందు పుట్టిన వారు ఎలక్షన్ కమిషన్ ఆమోదించిన ఆధార్కార్డు లాంటి 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒక గుర్తింపు పత్రాన్ని బీఎల్ఓలకు చూపాల్సి ఉంటుంది. ఇచ్చిన నోటీసుతో పాటు, ఈ పత్రాన్ని జత చేసి బీఎల్ఓలకు ఇస్తే వారి ఓటు ఓటరు జాబితాలోకి చేర్చుతారు.
● 1987 జూలై 2004 డిసెంబర్ 2 తేదీ మధ్యలో పుట్టిన వారు తమ గుర్తింపు కార్డు గానీ, తల్లిదండ్రుల్లో ఒకరి గుర్తింపు పత్రం గానీ నోటీసుతో పాటు జత చేస్తే సరిపోతుంది.
● యువ ఓటర్లు అంటే 2004 డిసెంబర్ 2 తర్వాత పుట్టిన వారు తమ సొంత గుర్తింపు కార్డుతో పాటు, తల్లిదండ్రుల గుర్తింపు కార్డును కూడా బీఎల్ఓలకు సమర్పించాలి. లేదంటే ఓటరు జాబితాలో చోటుండదు.
● పాసుపోర్టు, ఎస్ఎస్సీ మెమో, కుల ధృవీకరణ పత్రం, బ్యాంకు ఖాతా, పోస్టాఫీసు ఖాతా పాస్బుక్ ఇలాంటివి 12 రకాల్లో ఏదైనా ఒకటిని నోటీసుకు జత చేసి బీఎల్ఓలకు ఇస్తే సరిపోతుంది.


