హుస్నాబాద్రూరల్: గౌరవెల్లి ప్రాజెక్టు కింద తన తండ్రి భూమి పోయిందని, పైసా పరిహారం రాలేదని రైతు బుధవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట పురుగుల మందుతో నిరసన తెలిపాడు. వివరాలు ఇలా... గౌరవెల్లి గ్రామానికి చెందిన నందారం సంపత్ తండ్రి వెంకటయ్యకు చెందిన 5 ఎకరాల భూమి ప్రాజెక్టు కెనాల్ కింద పోయినా పరిహారం అందలేదు. భూ సేకరణ జాబితాలో తన తండ్రి పేరు ఉందని, అధికారులు పరిహారం ఇస్తామని చెప్పి సంతకాలు తీసుకొని మోసం చేశారని సంపత్ ఆరోపించారు. పరిహారం కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి నా తండ్రి మనోవేదనతో మరణించినా న్యాయం జరగలేదన్నారు. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ దగ్గరకు వెళ్లి సమస్యను చెప్పడంతో ఆయన ఆర్డీవోకు ఫోన్ చేసి చెప్పారని తెలిపారు. ఆర్డీవో రాంమూర్తి బాధితుడితో మాట్లాడి న్యాయం చేస్తాననడంతో సంపత్ శాంతించాడు. దీంతో పోలీసులు వచ్చి మందు డబ్బా తీసుకొని అతడ్ని ఇంటికి పంపించారు.


