పాపన్నపేట(మెదక్): దంపతులను కట్ల పాము కాటు వేయడంతో భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మండలంలోని బోడగట్టులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన మల్లయ్యగారి కవిత(35),సంగమేశ్ దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. మంగళవారం రాత్రి భార్యాభర్తలు ఇంట్లో నిద్రపోయారు. ఈ క్రమంలో వారిని పాము కాటేసింది. మేల్కొన్న దంపతులు సుమారు అరగంట పాటు పాము కోసం వెతికి చంపేశారు. అనంతరం పామును తీసుకొని శంకరంపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యుడు పరీక్షించి, సంగారెడ్డి తీసుకెళ్లాలని సూచించారు. వెంటనే అక్కడకు వెళ్లగా చికిత్స పొందుతూ కవిత మృతి చెందింది. భర్త సంగమేశ్ పరిస్థితి విషమంగా ఉంది.
ఓ వైపు అంత్యక్రియలు..
మరో వైపు బతుకు పోరాటం
భార్య కవిత అంతిమ యాత్రలో కనీసం భర్త పాల్గొనలేని పరిస్థితి ఏర్పడింది. బుధవారం సాయంత్రం కవితకు అంత్యక్రియలు నిర్వహించగా, భర్త సంగారెడ్డి ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. ముగ్గురు కూతుళ్ల రోదనలతో ఆ ప్రాంతం కన్నీటి సంద్రంగా మారింది. దుస్థితిని చూసి బోడగట్టు ప్రజలు బోరున విలపించారు.
భార్య మృతి.. భర్త పరిస్థితి విషమం మెదక్ జిల్లాలో విషాదం


