హెచ్పీవీపై వ్యాక్సిన్ పోరు
ఆందోళన కలిగిస్తోన్న గర్భాశయ ముఖ క్యాన్సర్లు
● వ్యాధిని నిరోధించేందుకే పంపిణీ
● ఏర్పాట్లు చేసిన జిల్లా అధికారులు
న్యాల్కల్ (జహీరాబాద్): ఇటీవల చాలామంది మహిళలు ప్రధాన ఎదుర్కొంటున్న సమస్య గర్భాశయ ముఖ క్యాన్సర్. హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ)గా పిలిచే ఈ వ్యాధి బారిన పడి చాలామంది మృత్యువాత పడుతున్నారు. హెచ్పీవీపై చాలామంది సెలబ్రిటీలు అవగాహన కల్పించేందుకు ముందుకు వస్తున్నారు. ఇక వ్యాధిని అరికట్టి పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. ఇందులోభాగంగా హెచ్పీవీ వ్యాక్సిన్ పంపిణీకి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఈ టీకాను 14–15 ఏళ్లలోపు ఉన్న బాలికలకు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫిబ్రవరి 28న లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక జిల్లాలో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
వ్యాధి మహిళల్లోనే అధికం
హెచ్పీవీ (హ్యూమస్ పాపిలోమా వైరస్)వ్యాధి మహిళల్లోనే అధికంగా కనిపిస్తోంది. ఈ వైరస్ వల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఎక్కువగా వస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దాని నివారణ కోసమే హెచ్పీవీని అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలో జిల్లా ఆస్పత్రి–1, ఏరియా ఆస్పత్రులు–4, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు–3, పీహెచ్సీలు–29, ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలు–445 ఉన్నాయి. వాటి పరిధిలో 14–15 ఏళ్లలోపు వారు 12,979 మంది బాలికలున్నారు. వారందరికీ ఆయా ఆస్పత్రుల్లో హెచ్పీవీ వ్యాక్సిన్ ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆస్పత్రులతోపాటు పాఠశాలల్లో కూడా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు సమాచారం.
టీకా వల్ల ప్రయోజనాలు
14–15 ఏళ్ల మధ్య వయస్సు గల బాలికలకు ఎక్కువగా హెచ్పీవీ సోకుతుందని గుర్తించిన ప్రభుత్వం వారందరికీ ఉచితంగా టీకాను అందించేందుకు చర్యలు చేపట్టింది. టీకా వేయడం వల్ల క్యాన్సర్కు కారమణయ్యే వైరస్ నెమ్మదిగా క్షీణిస్తుంది. గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ తగ్గి మహిళల ఇబ్బందులు దూరం కానున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
హెచ్పీవీపై వ్యాక్సిన్ పోరు


