కూతురు దగ్గరకు వెళ్తూ అనంతలోకాలకు..
● బైకును ఢీకొన్న కాలేజీ బస్సు..
● అక్కడికక్కడే మహిళ మృతి
సంగారెడ్డి క్రైమ్: రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్తకు గాయాలయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రామనాయుడు వివరాల ప్రకారం... కొండాపూర్ మండలం తేర్పోల్ గ్రామానికి చెందిన డాకురి నర్సింహులు, ఆయన భార్య లావణ్య (38)తో కలిసి సోమవారం పుల్కల్ మండలం వెండికోల్ గ్రామంలోని తన కుమార్తె వద్దకు బైక్పై బయలుదేరారు. ఈ క్రమంలో సాయంత్రం సంగారెడ్డి కొత్త బస్టాండ్ నుంచి జోగిపేట్ ప్రధాన మార్గంలో మర్రిలక్ష్మణ్ రెడ్డి కాలేజీ బస్సు హకీం కార్నర్ వద్ద వెనకనుంచి వచ్చి వీరి బైకును ఢీకొట్టింది. అనంతరం బస్సు టైర్ లావణ్య పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. నర్సింహులుకు గాయాలయ్యాయి. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, బస్సు డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు.


