న్యాల్కల్ రూపురేఖలు మారిపోతాయి
న్యాల్కల్(జహీరాబాద్): నిమ్జ్లో భాగంగా పరిశ్రమల ఏర్పాటు కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, వచ్చే పదేళ్లలోపు న్యాల్కల్ రూపురేఖలు మారిపోతాయని ఎంపీ సురేశ్ షెట్కార్ పేర్కొన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ)లో రూ.16లక్షల సీఎస్ఆర్ నిధులతో పూర్తి చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను శుక్రవారం రాత్రి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...నిమ్జ్లో పరిశ్రమలు ఏర్పాటైతే ఈ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. జిల్లాలోని అన్ని పీహెచ్సీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. పీహెచ్సీని ముప్పై పడకల ఆస్పత్రిగా మార్చాలని, పోలీస్ స్టేషన్ మంజూరు చేయాలని, 108 వాహనం కూడా మంజూరు చేయాలని స్థానిక నాయకులు సిద్దిలింగయ్యస్వామి, ప్రవీణ్కుమార్ ఎంపీని కోరారు. అందుకు స్పందించిన ఆయన ముప్పై పడకల ఆస్పత్రి ప్రతిపాదనలో ఉందని, పోలీస్ స్టేషన్ ఏర్పాటు అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. 108 వాహనాన్ని ఇంతకుపూర్వమే న్యాల్కల్కు మంజూరు చేయించానని అదెక్కడున్నా వెంటనే దానిని ఇక్కడకు పంపించాలని డీఎంహెచ్ఓకు సూచించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో మౌలిక వసతులు కల్పించిన సీఐఈ సంస్థ ప్రతినిధులను అభినందించారు. ఉత్తమ సేవలందించిన వైద్య సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ వసంతరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓలు మనోహార్రెడ్డి, శ్రీనివాస్, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, సీఐఈ ప్రతినిధులు అమోల్ సెవ్లే, ప్రశాంత్ శర్మ, వైద్యుడు అమృత్రాజ్, సిబ్బంది పాల్గొన్నారు.
పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు
ఎంపీ సురేశ్ షెట్కార్


