
బైబిల్ హౌస్ ప్రారంభం
మెదక్జోన్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చి ప్రాంగణంలో సోమవారం మాడరేటర్ ప్రొఫెసర్ రూబెన్మార్క్ బైబిల్ హౌస్ను ప్రారంభించారు. ఇందులో అన్ని భాషల్లో ఉన్న బైబిళ్లు ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో చర్చి ప్రెసిబెటరి ఇన్చార్జి శాంతయ్య, గంట సంపత్ తదితరులు ఉన్నారు.
కరాటేలో విద్యార్థి ప్రతిభ
దుబ్బాకటౌన్: హైదరాబాద్లోని బోడుప్పల్ లో బొమ్మక్ శంకరయ్య కన్వెన్షన్లో ఆదివారం రాష్ట్రస్థాయి కరాటే చాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో దుబ్బాకకు చెందిన యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ విద్యార్థి వేముల హర్షవర్ధన్ పాల్గొని గోల్డ్ మెడల్ సాధించి సత్తా చాటాడని కరాటే మాస్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాంత్కు సైతం నిర్వాహకులు బెస్ట్ కోచ్ అవార్డు అందించారు. ఇరువురిని నిహాన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే ఆర్గనైజేషన్ ఇండియా వ్యవస్థాపకుడు రవీందర్, రేంజుకి షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే అకాడమీ వ్యవస్థాపకుడు మాస్టర్ నగేశ్, అధ్యక్షుడు అశోక్, జనరల్ సెక్రటరీ నవీన్ కుమార్, సురేందర్, సిద్ధార్థ్ అభినందించారు.
అడవి పందుల బీభత్సం
పంటలు ధ్వంసం
అక్కన్నపేట(హుస్నాబాద్): పంటలను అడవి పందులు ధ్వంసం చేశాయి. మండలంలోని రామవరం గ్రామ పరిధిలోని బంగారు లొద్దితండా, సేవాలాల్ మహారాజ్ తండాలో సుమారు 13మంది రైతులు సాగుచేసిన మొక్కజొన్న, ఇతర పంటలపై పందులు దాడి చేశాయి. సోమవారం వ్యవసాయ విస్తరణాధికారి శ్రీలతతోపాటు ఫారెస్టు అధికారులు పంటలను పరిశీలించారు. నష్టపోయిన పంటల వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. అనంతరం రైతులు మాట్లాడుతూ.. ప్రస్తుతం చేను కంకి దశలో ఉందన్నారు. చేను చుట్టూ వల, చీరలు కట్టి..రాత్రి కాపలా ఉన్నా కూడా పంటపై దాడి చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని పలువురు రైతులు కోరారు.
మెరుగైన ఫలితాలు సాఽధించాలి
నర్సాపూర్: రోజువారి ప్రణాళికతో చదివి మెరుగైన ఫలితాలు సాధించాలని రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు ప్రత్యేక పరిశీలకుడు కిషన్ విద్యార్థులకు సూచించారు. ఆయన సోమ వారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. వంద శాతం ఫలితాలు సాధించేలా అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. కాగా కాలేజీకి చెందిన పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పలు అంశాలను ప్రిన్సిపాల్ శేషాచారి ఆయనకు వివరించారు.
రాష్ట్ర స్థాయి క్రీడలకు విద్యార్థులు
చిన్నకోడూరు(సిద్దిపేట): విద్యార్థులు క్రీడల్లో సత్తా చాటారు. మండల పరిధిలోని ఇబ్రహీంనగర్ ఆదర్శ పాఠశాల విద్యార్థులు క్రీడల్లో మొదటి స్థానంలో నిలిచారు. త్వరలో హైదరాబాద్లో జరగబోయే రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికయ్యారు. ఈ నెల 24, 25 తేదీల్లో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో జరిగిన జిల్లా స్థాయి త్రోబాల్ పోటీల్లో విద్యార్థుల జట్టు మొదటి స్థానంలో నిలిచింది. జట్టుకు రూ. 10 వేల నగదు, ట్రోఫీ, ప్రశంసా పత్రాలు అందజేశారు. నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 3 వేల నగదు, సర్టిఫికెట్లు అందజేశారు.
పేకాట రాయుళ్ల అరెస్టు
న్యాల్కల్(జహీరాబాద్): నలుగురు పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ సుజిత్ కథనం ప్రకారం... హద్నూర్ గ్రామ శివారులో గ్రామానికి చెందిన కొందరు పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం దాడి చేశారు. దాడిలో పట్టుబడిన నలుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.3980 నగదు, పేకాట ముక్కలు, రెండు ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

బైబిల్ హౌస్ ప్రారంభం

బైబిల్ హౌస్ ప్రారంభం

బైబిల్ హౌస్ ప్రారంభం