అతివేగానికి దంపతుల బలి | Young Couple Die In Road Accident At Sangareddy - Sakshi
Sakshi News home page

అతివేగానికి దంపతుల బలి

Aug 29 2023 2:52 AM | Updated on Aug 29 2023 1:35 PM

- - Sakshi

నర్సాపూర్‌ రూరల్‌: అతి వేగం, అజాగ్రత్త రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. రెండు బైకులను కారు ఢీ కొట్టిన సంఘటన నర్సాపూర్‌–మెదక్‌ జాతీయ రహదారిలోని మూతపడిన షుగర్‌ ఫ్యాక్టరీ సమీపంలో సోమవారం జరిగింది. ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. నర్సాపూర్‌ ఎస్సై శివకుమార్‌ వివరాలు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్‌ మండలం శాఖాపూర్‌ గ్రామానికి చెందిన గడ్డమీది నవీన్‌ కుమార్‌(28), భార్య సుజాత (26)లు బైక్‌ పై నర్సాపూర్‌ మీదుగా హైదరాబాద్‌ వెళ్తున్నారు.

మరో బైక్‌పై నర్సాపూర్‌ మండలం పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన కట్ట కరుణాకర్‌ నర్సాపూర్‌ వైపు వస్తున్నాడు. హైదరాబాద్‌ నుంచి నర్సాపూర్‌ మీదుగా మెదక్‌ వైపు అతివేగంగా వెళ్తున్న కారు ఈ రెండు బైకులను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నవీన్‌ కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందగా అతని భార్య నర్సాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందింది. మరో బైక్‌ పై వెళ్తున్న కరుణాకర్‌కు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. దంపతుల మృతదేహాలను నర్సాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

జీవనోపాధి కోసం....
జీవనోపాధి కోసం నవీన్‌ కుమార్‌ హైదరాబాద్‌ రామచంద్రపురంలో అద్దె ఇంట్లో ఉంటూ ఫొటో ఫ్రేమ్‌ షాపును నిర్వహిస్తున్నాడు. అతని తల్లిదండ్రులు వృద్ధులైన లింగయ్య, శ్యామమ్మ స్వగ్రామమైన శాఖాపూర్‌లో ఉంటున్నారు. నవీన్‌కుమార్‌ భార్య మెదక్‌ జిల్లా చిలిపిచేడ్‌ మండల కేంద్రంలోని మానసిక దివ్యాంగుల పాఠశాలలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తుంది. మృతులకు రెండేళ్ల కూతురు సాయి హిమని ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement