తుర్కయంజాల్: బీసీ, ఎస్సీ కులాలకు చెందిన రైతులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం అభివృద్ధి పనుల పేరుతో లాక్కోవడం దారుణమని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలం కొహెడలో పండ్ల మార్కెట్, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణం కోసం కోల్పోనున్న భూములను గురువారం ఆయన రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా భూములను ప్రభుత్వం అధీనంలోకి తీసుకోవడంతో అనేక మంది ఉపాధిని కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నష్టపోతున్న ప్రతి రైతుకు పరిహారంతో పాటు, 500 గజాల ప్లాట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తుర్కయంజాల్ బీజేపీ అధ్యక్షుడు ఎలిమినేటి నర్సింహారెడ్డి, రైతు సేవా సహకార సంఘం మాజీ వైస్ చైర్మన్ కొత్త రాంరెడ్డి, సీనియర్ నాయకులు బచ్చిగళ్ల రమేష్, కందాల బల్దేవ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కరాడి శ్రీలత అనిల్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం మద్దతు
కొహెడ సర్వే నంబర్ 167 బై 1లో భూములు కోల్పోతున్న రైతులు మూడు రోజులుగా చేపడుతున్న నిరసనకు గురువారం సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏర్పుల నర్సింహ, జిల్లా కమిటీ సభ్యుడు డి.కిషన్ మాట్లాడుతూ.. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎం.సత్యనారాయణ, శ్రీను, మల్యాద్రి, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్


