షాద్నగర్రూరల్: గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న అక్రమ మట్టి దందాపై శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. మట్టి సరఫరా చేస్తున్న మూడు టిప్పర్లు, ఒక జేసీబీని సీజ్ చేశారు. ఈ సంఘటన ఫరూఖ్నగర్ మండల పరిధిలోని విఠ్యాల గ్రామ పంచాయతీ శ్యామలబండతండాలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ సుశీల కథనం ప్రకారం.. శ్యామలబండతండా సమీపంలో కొంత కాలం క్రితం అగ్రిగోల్డ్ వెంచర్ను ఏర్పాటు చేశారు. ఈ వెంచర్ కొంత కాలంగా వివాదాస్పదంగా ఉండటం, ఇళ్ల స్థలాలపై కోర్టులో కేసులు నడుస్తుండటంతో యజమానులు వెంచర్ వైపు రావడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు అక్రమ మట్టి వ్యాపారులు యథేచ్ఛగా అగ్రిగోల్డ్ వెంచర్లో అక్రమ మట్టి దందాకు దిగారు. ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీతో ప్లాట్లను తవ్వి రాత్రింబవళ్లు మట్టి దందాను కొనసాగిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఓటీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాడి చేసి మూడు టిప్పర్లు, ఒక జేసీబీని సీజ్ చేసి స్థానిక పోలీస్స్టేషన్లో అప్పగించారు.


