● వెంటాడిన రోడ్డు ప్రమాద కేసు
● శ్రీశైలం హైవే పక్కన ఉరేసుకున్న వైనం
ఇబ్రహీంపట్నం రూరల్: మద్యం మత్తులో ఇద్దరిని ఢీకొట్టడంతో మనోవేదన చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శ్రీశైలం హైవేపై నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో చోటుచేసుకుంది. ఆదిభట్ల సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన ఎరుకలి బాలరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి తుర్క యంజాల్లో నివాసం ఉంటున్నాడు. ఆయన కు మారుడు బాలకృష్ణ(28) ఈ నెల 8వ తేదీన అర్ధరాత్రి మద్యం తాగి కారులో తుర్కయంజాల్లోని బవర్చి వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మనోజ్, మంజునాథ్ తీవ్రంగా గా యపడ్డారు. దీంతో క్షతగాత్రులు ఆదిభట్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు 9వ తేదీన బాలకృష్ణపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీస్స్టేషన్కు రావాలని తండ్రీకొడుకులను నోటీసు అందజేశారు.
చనిపోతానని ఇంట్లో నుంచి వెళ్లి
ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన తీవ్ర మనోవేదనకు బాలకృష్ణ లోనయ్యాడు. మధ్యాహ్నం తాను చనిపోతున్నట్లు కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. వెంటనే ఆయన భార్య స్పందించి 100 కాల్ చేసి చెప్పింది. ఆదిభట్ల పోలీసులు అప్రమత్తమై లోకేషన్ ఆమనగల్లులో గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులను అలర్ట్ చేశారు. అటవీ ప్రాంతం ఉండటంతో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మిస్సింగ్ కేసుగా సాయంత్రం నమోదు చేశారు.
కుటుంబీకుల సపోర్ట్ లేక
గురువారం ఉదయం శ్రీశైలం హైవే పక్కన చెట్టుకు ఉరి వేసుకొని ఓ వ్యక్తి ఉన్నాడని సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు, పోలీసులు వెళ్లి పరిశీలించి బాలకృష్ణ(28)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం మేరకు మద్యం మత్తులో ప్రమాదం కలిగించానని, కుటుంబ సభ్యుల సహకారం లేకపోవడంతో మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిపారు.


