సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరిలో 74 కేసులకు సంబంధించి 117 మందిని అరెస్టు చేశారు. నిందితులందరినీ 16 రాష్ట్రాల్లో గాలించి పట్టుకున్నట్లు అదనపు సీపీ ఎం.శ్రీనివాసులు గురువారం ప్రకటించారు. 63 మంది ట్రేడింగ్/ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్, ఆరుగురు డిజిటల్ అరెస్టు, నలుగురు ఓటీపీ ఫ్రాడ్, ఒకరు సోషల్మీడియా ఫ్రాడ్స్ కేసుల్లో నిందితులు చిక్కారు. మరోపక్క బాధితులు కోల్పోయిన మొత్తంలో రూ.34,76,884 ఫ్రీజ్ చేయించి, రీఫండ్ చేశారు. గతనెల్లో అరెస్టు అయిన 117 మందిపై దేశంలోని వివిధ ఠాణాల్లో నమోదైన 1081 కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.వీరి బ్యాంక్ ఖాతాల్లో రూ.139 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు తేల్చారు. ఈ నిందితుల నుంచి రూ. 36 లక్షల నగదు, 221 ఫోన్లు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నగరంలోని జోనల్ సైబర్ సెల్స్కు ఫిబ్రవరిలో 2963 ఫిర్యాదులు అందగా... వీటిలో 461 కేసులుగా నమోదయ్యాయి. ఈ అధికారులు 11 మందిని అరెస్ట్ చేసి, బాధితులకు రూ.24,10,741 రీఫండ్ చేయించారు. నిరంతర సైబర్ పెట్రోలింగ్, ఇంటెలిజెన్స్ ట్రాకింగ్ ద్వారా ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తున్న 124 ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ ప్రొఫైల్స్ను పోలీసులు గుర్తించారు. ఇవి 539 ప్రకటనల ద్వారా యువతను ఆకర్షిస్తుండటంతో వీటిని తొలగించారు. సీ–మిత్ర అధికారులు 2,396 మంది బాధితులకు ఫోన్ చేసి సహాయం అందించారు. ఫిర్యాదుల ఆధారంగా 257 జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలి.
16 రాష్ట్రాల్లో పట్టుకున్న సైబర్ కాప్స్
రూ.34.76 లక్షలు బాధితులకు రీఫండ్
ఫిబ్రవరి గణాంకాలు వెల్లడించిన అదనపు సీపీ


