పంజగుట్ట: బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రంజాన్ మాసం మొత్తం పండగలా ఉండేది కానీ ఇప్పుడు పండగలానే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం సోమాజిగూడలోని జయా గార్డెన్లో మాజీ ఎమ్మెల్సీ సలీం ఆధ్వర్యంలో రంజాన్ రేషన్ కిట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ... గతంలో బీఆర్ఎస్ హయాంలో రంజాన్ తోఫా, బతుకమ్మ చీరలు, క్రిస్మస్ గిఫ్టులు, షాదీ ముబారక్ కింద ఒక లక్ష రూపాయలు ఇచ్చేవారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే షాదీ ముబారక్ లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తానని హామీ ఇచ్చారని దాన్ని తుంగలో తొక్కారని అన్నారు. తులం బంగారం ఏమో గాని.. ఏ టైంలో వచ్చి మా ఇండ్లను కూల్చేస్తారో అని పేదలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. రంజాన్ పవిత్ర మాసంలో అబద్దాలాడిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను ఆ దేవుడు కూడా క్షమించడని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అక్కున చేరిన దానం నాగేందర్ కాంగ్రెస్ గుర్తుపై ఎంపీగా పోటీ కూడా చేసి నేను పార్టీ మారలేదు అంటూ అబద్ధమాడుతున్నాడన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ కార్పొరేటర్ ఏ మహేష్ యాదవ్ లక్ష్మీ ప్రసన్న పాల్గొన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్


