పహాడీషరీఫ్: తొమ్మిది నెలల కూతురుతో కలిసి గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ బి.లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పహాడీషరీఫ్ గ్రామానికి చెందిన షేక్ మహ్మద్ షరీఫ్, హీనా బేగం(19) దంపతులకు ఇద్దరు కూతుళ్లు సంతానం. పెద్ద కూతురు ఫాతీమాను నాలుగు రోజుల క్రితం వాదే ముస్తఫా బస్తీలోని అమ్మమ్మ ఇంట్లో వదిలేశారు. తొమ్మిది నెలల వయసున్న చిన్న కూతురు ఫిర్దోస్తో కలిసి బుధవారం ఉదయం ఇంట్లోనే ఉన్న హీనా బేగం సాయంత్రం భర్త వచ్చి చూడగా కనిపించలేదు. స్థానికంగా వెతికినా తల్లి, కూతురు ఆచూకీ లభ్యం కాలేదు. ఈ విషయమై వెంటనే పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీరి ఆచూకీ తెలిస్తే పోలీస్స్టేషన్లో గాని 87126 62367 నంబర్లోనైనా సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.
కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తే కేసులు
కొత్తూరు మున్సిపల్ కమిషనర్ బాలాజీ
కొత్తూరు: ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం మున్సిపల్ కమిషనర్ బాలాజీ సిబ్బందితో కలిసి కొత్తూరు పట్టణంలోని హోటళ్లు, బేకరీల్లో తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన నాణ్యమైన ఆహార పదర్థాలను మాత్రమే విక్రయించాలని, శుభ్రత పాటించాలని సూచించారు. కాలం చెల్లిన, మురిగిన కూరగాయలను ఉపయోగించినట్లు గుర్తిస్తే కేసులు తప్పవన్నారు. తనిఖీల్లో భాగంగా ఓ హోటల్లో కాలం చెల్లిన పదార్థాలను గుర్తించి జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో శానిటైజేషన్ అధికారి మహేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


