మహేశ్వరం: ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై, విజయవంతం చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని సిరిగిరిపురంలో మంగళవారం ఆయన ప్రభుత్వ పాఠశాల, క్రీడా మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. పెండింగ్లో ఉన్న ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సిరిగిరిపురంలో ప్రభుత్వ పాఠశాల బాగుందని, సర్పంచ్ దయ్యాల కృష్ణవేణి ప్రత్యేక చొరవ తీసుకొని సొంత నిధులు వెచ్చించి అభివృద్ధి చేయడాన్ని అభినందించారు. అనంతరం మహేశ్వరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. అసంపూర్తిగా ఉన్న తహసీల్దార్ కార్యాలయాన్ని త్వరలో పూర్తి చేసి వాడుకలోకి తీసుకొస్తామన్నారు. మహేశ్వరం రోడ్డుపై శుభ్రత పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కోసం మంఖాల్ రెవెన్యూ సర్వే నంబర్ 131లో రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించారు. కార్యక్రమంలో కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ నరేష్, ఎంపీఓ రవీందర్రెడ్డి, ఆర్ఐ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ నారాయణరెడ్డి


