ఇబ్రహీంపట్నం రూరల్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేష్ పరామర్శించారు. సోమవారం నగరంలోని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. ఆరోగ్యం, బాగోగులు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఉద్యమకారుల హామీలు నెరవేర్చండి
బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్
నవాబుపేట: ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారు లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ డిమాండ్ చేశారు. మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లికి చెందిన ఉద్యమకారుడు మహేందర్ రెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి శుభప్రద్ పటేల్ పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లా డుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తమ మెనిఫెస్టోలో చెప్పిన విధంగా ఉద్యమకారులందరికీ 250గజాల ఇంటి స్థలం, ఉద్యమకారులను స్వతంత్ర సమయోధులుగా గుర్తించి ప్రతీ నెల గౌరవవేతనం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగిరెడ్డి, శాంతి కుమార్, మల్లేశం, నరసింహారెడ్డి, ప్రభాకర్రెడ్డి, కావలి శేఖర్, అశోక్ పాల్గొన్నారు.
ప్రాణాలు కాపాడిన సీటుబెల్టు
తాండూరు రూరల్: ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటన పెద్దేముల్ మండలం మారెపల్లి తండా గేటు వద్ద సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రశాంత్వర్ధన్ తెలిపిన ప్రకారం.. తాండూరు నుంచి మెహదీపట్నంకు వెళ్తున్న తాండూరు ఆర్టీసీ డిపోనకు చెందిన బస్సు, వికారాబాద్ నుంచి తాండూరుకు ప్రయాణిస్తున్న కారు మారెపల్లి గేటువద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పాక్షికంగా దెబ్బతినగా.. కారు చక్రాలు ఊడిపోయి నుజ్జునుజ్జయింది. కారు నడుపుతున్న హంతేజ్ సీటుబెల్టు ధరించడంతో బెలూన్లు తెరుచుకుని స్వల్పగాయాలతో బయటపడ్డాడు. హంతేజ్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.
నా భర్త నుంచి కాపాడండి
● ముగ్గురు ఆడపిల్లల తల్లి ఆవేదన
● పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
బషీరాబాద్: ‘నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నా భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని నన్ను, పిల్లలను చంపేందుకు కుట్ర చేస్తున్నాడు. తరచూ నాపై దాడికి పాల్పడుతున్నాడు. సోమవారం ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి తీవ్రంగా కొట్టాడు. మెడలో ఉన్న తాళి బొట్టు తెంపేశాడు. అతనితో నాకు, నా పిల్లలకు ప్రాణహాని ఉంది’ అంటూ ఓ మహిళ సోమవారం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు, పోలీసులు తెలిపసిన వివరాల ప్రకారం.. ఎక్మాయికి చెందిన జోగి అశ్విని, జోగి రవికుమార్ భార్యభర్తలు. వీరికి లావణ్య, వితిక, సుభిక్ష ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. డ్రైవర్గా పనిచేసే తన భర్త నిత్యం తాగి వచ్చి తనతో పాటు పిల్లలను ఇబ్బంది పెడుతున్నాడని పోలీసుల ఎదుట వాపోయింది. ఈ విషయంలో పలుమార్లు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా అతని తీరు మారడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది. తనకు, పిల్లలకు న్యాయం చేయాలని కోరింది. మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు జానకి బాధితురాలికి అండగా నిలిచారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.


