ఇబ్రహీంపట్నం రూరల్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను సోమవారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ నారాయణరెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం శ్రీపాదరావు సేవలను గుర్తు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పోక్సో కేసులో
నిందితుడికి జీవిత ఖైదు
పహాడీషరీఫ్: పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి ఎల్బీ నగర్ కోర్టు జీవిత ఖైదు విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పహాడీషరీఫ్ ఠాణా పరిధిలో 2024లో ఆటోడ్రైవర్ షేక్ ముజీబ్ (24) పెళ్లి చేసుకుంటానంటూ నమ్మబలికి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె శిశువుకు జన్మనిచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు డీఎన్ఏ ఆధారాలతో కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శోభారాణి, సత్యనారాయణ వాదనలు వినిపించారు. కేసు విచారించిన ఫాస్ట్ట్రాక్ కోర్టు న్యాయమూర్తి నిందితుడికి సాధారణ జీవిత ఖైదుతో పాటు రూ.70 వేల జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. ఇదే సమయంలో బాధితురాలికి రూ.15 లక్షల పరిహారం ప్రకటించారు.
యువతి అదృశ్యం
పహాడీషరీఫ్: యువతి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ బీఎల్ఎన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజ్కుమార్ కుటుంబంతో కలిసి పదిరోజుల క్రితం జల్పల్లి పిట్టలగూడెంకు వలస వచ్చాడు. తాను పనిచేస్తున్న బిల్డింగ్లోనే నివాసం ఉంటున్నాడు. ఈనెల 1న ఉదయం 10 గంటలకు అతని చిన్న కుమార్తె ముస్కాన్ అహిర్వార్ (20) ఇంట్లో చెప్పకుండా వెళ్లి తిరిగి రాలేదు. స్థానికంగా గాలించినా ఫలితం లేకపోవడంతో తండ్రి అదేరోజు రాత్రి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆచూకీ తెలిసిన వారు స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు సోమవారం కోరారు.


