పదోన్నతుల సంబురం
శంషాబాద్: సీఐఎస్ఎఫ్ ఏవియేషన్ సెక్యూరిటీ గ్రూప్ హైదరాబాద్లో పనిచేస్తున్న 217 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి లభించింది. సీనియర్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన సందర్భంగా వారికి దానికి సంబంధించిన చిహ్నాలను సీఐఎస్ఎఫ్ క్వార్టర్స్ రిక్రియేషన్ క్లబ్లో ఘనంగా అందించారు. ఈ సందర్భంగా సీనియర్ కమాండెంట్లు చిహ్నాలను వారి దుస్తులకు పెట్టారు. పదోన్నతి పొందిన కానిస్టేబుళ్లు మరింత ఉన్నతంగా రాణించాలని సూచించారు.
మృతదేహంతో రోడ్డుపై ధర్నా
ప్రమాదకారకుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్
మోమిన్పేట: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి శవంతో ధర్నా చేపట్టిన ఘటన మోమిన్పేటలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ భరత్భూషన్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని మొరంగపల్లికి చెందిన రుక్కల పాండు(56) శనివారం సాయంత్రం మోమిన్పేట సంతకు వెళ్లాడు. తిరుగుప్రయాణంలో దేవరంపల్లి గ్రామానికి చెందిన ఆనంద్ బైక్తో పాండును ఢీకొట్టాడు. దీంతో క్షతగాత్రుడిని సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాగా ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం ఉదయం మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే మృతుడి కుమారుడు బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో మృతుడి కుటుంబీకులు ఆదివారం సాయంత్రం అంబేడ్కర్ చౌరస్తా వద్ద శవంతో ధర్నా చేపట్టారు. ప్రమాదకారకుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ అక్కడకు చేరుకుని కుటుంబీకులతో మాట్లాడారు. ప్రమాదకారుకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని డిస్చార్జి చేసిన వెంటనే అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
ఆర్టీసీ డెయిలీ పాస్ ధర పెంపు
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ రోజువారీ (డైలీ) బస్ పాస్ ధర పెరిగింది. గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా డైలీ పాస్ చార్జీలను రూ.150 నుంచి రూ.130కి తగ్గించారు. తాజాగా ఈ రాయితీని ఆర్టీసీ ఉపసంహరించుకుంది. దీంతో యథావిధిగా డైలీ పాస్ చార్జీ రూ.130 నుంచి రూ.150 కి పెరిగింది. ఈ పాస్పైన ప్రయాణికులు ఏ బస్సుల్లోనైనా 24 గంటల పాటు ప్రయాణం చేయవచ్చు.
పదోన్నతుల సంబురం


