ఫ్యూచర్‌సిటీతోనే అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

ఫ్యూచర్‌సిటీతోనే అభివృద్ధి

Aug 22 2025 6:43 AM | Updated on Aug 22 2025 6:43 AM

ఫ్యూచర్‌సిటీతోనే అభివృద్ధి

ఫ్యూచర్‌సిటీతోనే అభివృద్ధి

యాచారం: ఫార్మాసిటీ బదులు ఫ్యూచర్‌సిటీని నిర్మిస్తున్నామని, ఇందుకు ప్రజల మద్దతు అవసరమని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని కుర్మిద్ద, మంగళిగడ్డతండా, మర్లకుంటతండా, తాడిపర్తి గ్రామాల్లో గురువారం రూ.12 కోట్ల నిధులతో ఎమ్మెల్యే 117 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీఆర్‌ఎస్‌ హయాంలో ఫార్మాసిటీని నిర్మించాలని కుట్రలు చేశారన్నారు. కానీ రేవంత్‌రెడ్డి సర్కార్‌ ఫార్మాసిటీని రద్దు చేసి అదే భూముల్లో ఫ్యూచర్‌సిటీని నిర్మిస్తున్నామన్నారు. దీంతో ఈ ప్రాంతం అభివృద్ధిపథంలో దూసుకెళ్తుందన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో 20 ఏళ్ల దూరదృష్టితో అభివృద్ధి పనులు చేపట్టడానికి టీజీఐఐసీ ప్రత్యేక నిధులు మంజూరు చేస్తుందన్నారు. అందులో భాగంగా యాచారం–కందుకూరు రోడ్డును వంద అడుగులకు విస్తరించడానికి కృషి చేస్తానన్నారు. ఫార్మాసిటీ భూసేకరణలో నకిలీ, బినామీ పేర్లతో రూ.కోట్లాది పరిహారం పొందిన అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ అనంత్‌రెడ్డికి సూచించారు. కుర్మిద్దలో అసైన్డ్‌ పట్టాదారు, పాసుపుస్తకాల్లో ఉన్న ఎకరాలకు మొత్తం పరిహారం ఇవ్వకుండా అప్పటి అధికారులు మోసం చేశారని రైతులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఫార్మాసిటీకి పట్టా భూములు ఇవ్వనందుకు అప్పటి అధికారులు టీజీఐఐసీ పేరు మీద భూ రికార్డులు మార్చేశారని, వాటిని మళ్లీ తమపై మార్చేలా కృషి చేయాలని కుర్మిద్ద, తాడిపర్తి గ్రామాల్లోని రైతులు ఎమ్మెల్యేకు వినతిపత్రాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ గురునాథ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లు, మాజీ వైస్‌ ఎంపీపీలు శ్రీనివాస్‌రెడ్డి, రాంరెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నర్సింహ, మాజీ ఎంపీటీసీ యాదయ్యచారి, మాజీ సర్పంచులు వెంకట్‌రెడ్డి, రమేష్‌, రాజశేఖర్‌రెడ్డి, నాయకులు వెంకట్‌రెడ్డి, అరవింద్‌నాయక్‌, సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement