● జిల్లాకు జాతీయ రహదారి కరువు ● నిలిచిన సిరిసిల్ల–సిద్దిపేట రోడ్డు ● ప్రతిపాదనల్లోనే కరీంనగర్–పిట్లం ఫోర్లేన్ ● రూ.1,745 కోట్లతో రహదారుల అభివృద్ధికి ప్రతిపాదనలు ● తొమ్మిదేళ్లుగా వీడని గ్రహణం
సిరిసిల్ల: కార్మిక, ధార్మిక క్షేత్రంగా
భాసిల్లుతున్న జిల్లాకు ఒక్క జాతీయ రహదారి దిక్కులేదు. పొరుగున ఉన్న కామారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు దశాబ్దాల కిందటే దరిచేరాయి. జిల్లాకు రెండు జాతీయ రహదారులు వస్తాయని, ఫోర్లేన్ రోడ్లు రూపుదిద్దుకుంటాయని గతంలో నేతలు ప్రకటించిన మాటలు నీటిమీద రాతలయ్యాయి. తొమ్మిదేళ్లుగా జాతీయ రహదారులకు అడుగులు పడడం లేదు. సిద్దిపేట నుంచి సిరిసిల్ల కలెక్టరేట్ వరకు ప్రతిపాదించిన ఎన్హెచ్–365–బీ రోడ్డు పనులు సర్వే స్థాయిలోనే
నిలిచిపోయాయి.
తొమ్మిదేళ్లుగా ప్రతిపాదనల్లోనే...
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) జిల్లాలోని రెండు ప్రధాన రహదారులను నేషనల్ హైవేలుగా 2017లో గుర్తించింది. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల అభివృద్ధికి జాతీయ రహదారులు బాసటగా నిలుస్తాయని జిల్లా ప్రజలు భావించారు. కానీ తొమ్మిదేళ్లుగా పాలకులు జాతీయ రహదారుల నిర్మాణంపై ఊరిస్తూనే ఉన్నారు.
నోటిఫికేషన్ జారీ
సిద్దిపేట జిల్లా దుద్దెడ నుంచి రగుడు వరకు 54 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి జాతీయ రహదారుల విభాగం భారత ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ఎస్.వో.3514(ఈ) తేదీ 23.11.2016, మోర్త్ లెటర్ నంబరు ఆర్డబ్ల్యూ/హెచ్వైడీ/ఎన్హెచ్–365/130 కేఎం, 184/సీఆర్వో/775 తేదీ: 18.12.2023 ప్రకారం లెటర్ నంబరు ఈఈ/ఎన్హెచ్/ఎస్డీపీటీ/ఎన్హెచ్ /365బీ/2024–25/553 తేదీ: 08.10.2024 ద్వారా సంయుక్త సర్వేలకు ఆదేశాలు జారీ అయ్యాయి.


