సిరిసిల్ల: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణంతో రాజన్నసిరిసిల్ల జిల్లా ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. గల్ఫ్ దేశాలు దుబాయ్, సౌదీఅరేబియా, కువైట్ బహ్రెయిన్, ఖతార్లపై ఇరాన్ బాంబులు వేస్తుందన్న వార్తలు విని ఇక్కడ ఉన్న కుటుంబికుల గుండెల్లో భయాందోళనలు మొదలయ్యాయి. తమ వారు ఎట్లా ఉన్నారోనని తరచూ గల్ఫ్లో ఉన్న వారికి ఫోన్కాల్స్ చేస్తూ క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు. ఇలా జిల్లాలోని ప్రతీ గ్రామంలో ఇదే చర్చ సాగుతోంది.
నాలుగు దశాబ్దాలుగా..
జిల్లాలో నాలుగు దశాబ్దాల కిందట నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, విప్లవోద్యమాలు.. పేదరికం.. పనిలేక వేలాది మంది పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారు. అత్యధికంగా దుబాయ్, సౌదీఅరేబియా, కువైట్ బహ్రెయిన్, ఖతార్ దేశాలకు ఉపాధి వెతుక్కుంటూ వెళ్లారు. జిల్లాకు చెందిన వేలాది మంది ఆయా దేశాల్లో పనిచేస్తూ ఇక్కడ కుటుంబాలకు ఆర్థికంగా అండదండగా ఉంటున్నారు. అయితే ప్రస్తుతం ఆయా దేశాల్లోని అమెరికా ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాంబులతో విరుచుకుపడుతుండడంతో గల్ఫ్ వలస కుటుంబాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు చెందిన 1.20 లక్షల మంది వలస జీవులు ఆ ఐదు దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. యుద్ధం జరుగుతుండడంతో వలస జీవుల యోగక్షేమాలు తెలుసుకుంటూ వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
విమానాలు ఆగిపోవడంతో చిక్కులు
హైదరాబాద్ నుంచి అమెరికా.. అటు నుంచి ఇటు తిరిగే విమానాలు దుబాయ్, అబుదాబీలో ల్యాండ్ అయి ఇంధనాన్ని నింపుకుంటాయి. ఇలా అక్కడ దిగిన వందలాది విమానాలు యుద్ధం కారణంగా అక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికులకు అక్కడే హోటళ్లలో వసతి కల్పించారు. కానీ రోజుల తరబడి దుబాయ్, అబుదాబీల్లో ఉండడంతో ఇండియాకు రాకుండా.. అమెరికా వెళ్లకుండా అక్కడే ఉండిపోయారు. ఇలా ఉన్న వారిలో కరీంనగర్కు చెందిన ఆకుల సత్యం, హైదరాబాద్కు చెందిన డాక్టర్ శశాంక్ కుటుంబ సభ్యులు అక్కడే ఆగిపోయారు. నిర్మల్కు చెందిన సముద్రాల రామారావు కుటుంబ అమెరికాకు వెళ్తూ దుబాయ్లో ఆగిపోయారు. ఇలా తెలంగాణ వాసులు ఇబ్బందులు పడుతున్నారు.


