సౌకర్యాలు లేక ఇబ్బంది
తాగునీరు కరువు
అలంకారప్రాయంగా టాయిలెట్స్
నీళ్లు లేక అలంకారప్రాయంగా ఉన్న టాయిలెట్
గంభీరావుపేటలోని పల్లె దవాఖానా
గంభీరావుపేట(సిరిసిల్ల): గ్రామీణులకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పల్లె దవాఖానాల్లో వసతులు కరువయ్యాయి. తాగునీరు లేక.. టాయిలెట్స్ సౌకర్యం లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో దాదాపు 5,500 జనాభాకు ఉపయోగపడేలా పల్లె దవాఖానాను మూడేళ్ల క్రితం నిర్మించారు. ఇక్కడ ఐదుగురు ఆశకార్యకర్తలు, ఇద్దరు ఏఎన్ఎంలు విధులు నిర్వర్తిస్తుంటారు. రోజుకు కనీసం 20–30 మంది రోగులు వస్తుంటారు.
రూ.20లక్షలతో భవనం
గంభీరావుపేటలో మూడేళ్ల క్రితం రూ.20లక్షలతో పల్లె దవాఖానా భవనం నిర్మించారు. వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. తాగునీటి సదుపాయం కల్పించలేదు. మరుగుదొడ్లు నిర్మించి పరికరాలు బిగించినప్పటికీ నీటి వసతి లేదు. మరుగుదొడ్ల నుంచి పైపులను సంపులోకి కాకుండా బయట ఖాళీ ప్రదేశంలోకి వదిలిపెట్టారు. విద్యుత్సౌకర్యం లేకపోవడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆస్పత్రికి వచ్చిన వారు అత్యవసరం తీర్చుకునేందుకు సమీపంలోని బాలికల హాస్టల్లోకి వెళ్లాల్సిన దుస్థితి. అక్కడి నుంచే బిందెలు, బకెట్లతో నీరు తెచ్చుకుంటున్నారు. మరోవైపు కిటికీల అద్దాలు పగిలి ఉండటంతో కోతులు లోపలికి వస్తున్నాయి.


