కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): విద్యార్థుల్లో సాధించాలనే తపనకు కృషి తోడైతే ఎంతటి లక్ష్యాన్నైనా అవలీలగా చేరుకుంటారని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్ పేర్కొన్నారు. నారాయణపురం సేవా సంస్థ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రాథమిక, జిల్లా పరిషత్ పాఠశాలల్లోని ప్రతీ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులను, తల్లిదండ్రులను గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నలిమెల భాస్కర్ మాట్లాడుతూ ఊరు పేరును నిలబెట్టాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉందన్నారు.
రిటైర్ట్ ఐఏఎస్ ఆఫీసర్ రమణాచారి, తిరుమల శ్రీనివాసాచారీలను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. పదో తరగతి విద్యార్థుల్లో ఎంత మంది అన్ని సబ్జెక్టుల్లో 90కి పైగా మార్కులతో మొత్తం 550 సాధిస్తే రూ.10వేల చొప్పున ప్రోత్సాహకంగా అందజేస్తానని ప్రకటించారు. అనంతరం సేవా సంస్థ తరఫున విద్యార్థులకు డైరీలు, నోట్బుక్స్ అందజేశారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం మనోహరాచారి, హెచ్ఎంలు చంద్రశేఖర్, దేవరాజు, నారాయణపురం సేవా సంస్థ సలహాదారులు పాత లింగన్న, నారాయణరెడ్డి, కిషన్, సుధాకర్రావు, సభ్యులు దేవిరెడ్డి, సుదర్శన్, దేవారెడ్డి, రాజు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
నానో ఎరువులతో అధిక దిగుబడి
● జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం
సిరిసిల్లఅర్బన్: నానో ఎరువులతో పంటల్లో అఽధిక దిగుబడి సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని చంద్రంపేట రైతువేదికలో వ్యవసాయశాఖ, భారతీయ రైతాంగ సహకార సంస్థ (ఇఫ్కో) సంయుక్తంగా నానో యూరియా ప్లస్, నానో డీఏపీ ఎరువుల వాడకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఇఫ్కో సంస్థ అభివృద్ధి చేసిన నానో యూరియా ద్రవం వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పుకు నాంది అన్నారు. కరీంనగర్ జిల్లా ఇఫ్కో ఏరియా మేనేజర్ బాలాజీ, జిల్లా మేనేజర్ డి.నరేశ్, ఏవో సందీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అవార్డు అందుకున్న రేఖ
● తొలి మహిళా చేనేత కార్మికురాలు
సిరిసిల్ల: జిల్లా కేంద్రానికి చెందిన వెల్ది రేఖ జాతీయ చేనేత దినో త్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో కొండా లక్ష్మణ్ బాపూజీ అవా ర్డును గురువారం హైదరాబాద్లో అందుకున్నారు. చేనేత మగ్గంపై రాజన్న సిరిపట్టు పితాంబరం చీరను నేసి అవార్డుకు ఎంపికయ్యారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అవార్డు పొందిన తొలి మహిళా చేనేత కార్మికురాలిగా రేఖకు గుర్తింపు లభించింది. రేఖ భర్త వెల్ది హరిప్రసాద్ సూక్ష్మమగ్గంతో గుర్తింపు పొంది చేనేత మగ్గంపై పలు ప్రయోగాలు చేశారు.
గెస్ట్ టీచర్ల పోస్టుకు దరఖాస్తులు
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో గెస్ట్ టీచర్ల నియామకానికి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రత్యేకాధికారిణి పావని గురువారం ప్రకటనలో తెలిపారు. సీఆర్టీ, హిందీ సబ్జెక్టుల్లో బోధించడానికి అర్హత గల అభ్యర్థులు ఈనెల 8 నుంచి 11 వరకు పాఠశాలలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.
రద్దీ రోజుల్లో అభిషేకాలు రద్దు
వేములవాడ: శ్రావణమాసం, వరుస సెలవుల నేపథ్యంలో అభిషేకం పూజలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో రాధాభాయి గురువారం తెలిపారు. ఈనెల 8, 9, 15, 16 తేదీల్లో అభిషేకాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్నపూజలు సమయానికి అనుగుణంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. భక్తులు సహకరించాలని కోరారు.

విద్యార్థుల్లో సాధించాలనే తపన ఉండాలి

అవార్డు అందుకున్న రేఖ