18 ఏళ్లు నిండిన వారికి ప్యాకేజీ ఇవ్వరా.. ప్యాకేజీ ఇవ్వకుండానే బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు నిర్వాసితుల ఆందోళన
ఇప్పుడు కాకపోతే..
మార్కాపురం టౌన్: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల్లో భాగంగా 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులకు ప్రభుత్వం పరిహారం ఇప్పుడు చెల్లించకపోవడంతో పాటు గ్రామాలను బలవంతంగా ఖాళీ చేయించడంతో ఎప్పుడు ఇస్తారోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు పూర్తి చేసుకొని గ్రామాలను తరలించే రోజు నాటికి 18 సంవత్సరాలు నిండిన ఆడ, మగ ప్రతి ఒక్కరూ పునరావాసానికి అర్హులేనని అన్నారు. వారందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని నిర్వాసితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వెలిగొండ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లించి, పునరావాస కాలనీలో నివాస గృహాలు నిర్మించుకునేందుకు తగిన సమయం ఇవ్వాలని, వెంటనే ఖాళీ చేయాల్సిందిగా ప్రభుత్వం నిర్వాసితులపై ఒత్తిడి తెచ్చి ఖాళీ చేయించడం సమంజసం కాదని మండిపడుతున్నారు.
ఆర్ఆర్ప్యాకేజీ ఇవ్వాలి
ప్రభుత్వం వెలిగొండ ముంపు ప్రాంతాల నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీని అందించాలి. గతంలో ఇచ్చిన జీవోను సవరించి ప్రస్తుతం 18 సంవత్సరాలు నిండిన వారికి ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేయాలి. వెలిగొండ ప్రాజెక్టు కోసం మా భూములను వదులుకుని వెళ్లడం బాధాకరం. ప్రస్తుతం ఆర్ఆర్ ప్యాకేజీని అర్హులైన అందరికీ అమలు చేసి మా ఖాతాల్లో జమ చేయాలి.
– యం.శశీంద్ర, సుంకేశుల


