● 12వ పీఆర్సీ, ఐఆర్, పెండింగ్ డీఏలు ప్రకటించాలి
● ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి డిమాండ్
మార్కాపురం: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి విమర్శించారు. బుధవారం స్థానిక ప్రెస్క్లబ్లో నిర్వహించిన జిల్లా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు, మధ్యంతర భృతి (ఐఆర్) మంజూరు, పెండింగ్ డీఏల విడుదల, ఆర్థిక బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు తదితర కీలక హామీలపై ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని తక్షణమే స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఐక్య ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఆర్థిక కార్యదర్శి జోసెఫ్ సుధీర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాలకు కేటాయించడం వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకుడు కె.ఎర్రయ్య మాట్లాడుతూ విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 23(1) నిబంధనను సవరించి ఇన్సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, ఇందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు వెంగళరెడ్డి, అమర్నాథ్, దేశానాయక్, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.


