అర్ధాకలితో
పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామంటూ విద్యాశాఖ ఊదరగొట్టింది. ఇందుకోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని గొప్పలు చెప్పింది. అయితే విద్యార్థుల ఆరోగ్యాన్ని గాలికొదిలేసింది. దాదాపు పది గంటల పాటు పాఠశాలలో ఉండే విద్యార్థులకు అల్పాహారం అందించాల్సి ఉంది. ప్రభుత్వం నిధులు విడుదలచేయకపోవడంతో విద్యార్థులు అర్ధాకలితో అల్లాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఉపాధ్యాయులు దాతల సహకారం తీసుకుని స్నాక్స్ అందిస్తున్నారు.
దాతలు సహకారంతో..
వంద రోజుల ప్రణాళికతో వంద శాతం ఉత్తీర్ణతతో పాటు ఉత్తమ ఫలితాల కోసం ప్రభుత్వం ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ఫలితాలపై ఉన్న దృష్టి విద్యార్థుల ఆరోగ్యంపై సారించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న సమయంలో విద్యార్థులకు అల్పాహారం అందించాల్సి ఉంది. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదలజేయలేదు. అల్పాహారం అందించాలంటే ఒక్కో పాఠశాలకు విద్యార్థుల సంఖ్యను బట్టి రోజుకు రూ.1000 నుంచి రూ.2 వేలు ఖర్చవుతోంది. విద్యార్థుల అవస్థలు చూడలేక కొన్ని పాఠశాలల్లో హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అర్ధాకలితో అల్లాడిపోతున్న వారికి అల్పాహారం అందించేలా చర్యలు తీసుకున్నారు. పూర్వ విద్యార్థులు, గ్రామంలోని పెద్దలకు పరిస్థితిని వివరించి మజ్జిగ, పండ్లు ఇచ్చేందుకు నిధులు సమీకరించారు.


