సహకార ఉద్యోగుల అర్ధనగ్న ప్రదర్శన
ఒంగోలులో అర్ధనగ్న ప్రదర్శనలో పాల్గొన్న సహకార శాఖ ఉద్యోగులు
మార్కాపురంలో మోకాళ్లపై కూర్చుని ఉద్యోగుల నిరసన
● 9వ రోజుకు చేరిన నిరవధిక సమ్మె
ఒంగోలు వన్టౌన్/మార్కాపురం రూరల్: రాష్ట్ర సహకార సంఘాల జేఏసీ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లాలో ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారంతో 9వ రోజుకు చేరుకుంది. ఒంగోలులో సహకార శాఖ ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శనతో సర్కారు తీరుపై తమ నిరసన తెలియజేశారు. స్థానిక డీడీసీసీబీ ప్రధాన కార్యాలయం నుంచి కలెక్టరేట్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వరకు నినాదాలు చేస్తూ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర యూనియన్ ఉపాధ్యక్షుడు పి.హనుమంతరావు మాట్లాడుతూ.. హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని, 2019–2024 వరకు పే రివిజన్ చేయాలని డిమాండ్ చేశారు. 2019 అనంతరం సహకార సంఘాల్లో చేరిన ఉద్యోగులను రెగ్యులర్ చేయడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 62 ఏళ్లకు రిటైర్మెంట్ అమలు చేయాలన్నారు. తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిస్కరించకపోతే బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు మనోజ్ కుమార్, రామాంజి రెడ్డి, రమేష్, అంజిరెడ్డి, ప్రసాద రావు, ఆంజనేయులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
మార్కాపురంలో మోకాళ్లపై నిరసన
మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సహకార శాఖ ఉద్యోగులు మోకాళ్లపై కూర్చుని, ఖాళీ కంచాలు మోగిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. సమస్యల పరిష్కారంలో సర్కారు వ్యవహారశైలిని ఉద్యోగులు తూర్పారబట్టారు. నిరసన కార్యక్రమాన్ని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డీకేఎం రఫీ ప్రారంభించి మాట్లాడారు. సంఘాల లాభనష్టాలతో సంబంధం లేకుండా ఉద్యోగులకు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీఓ నెం 36 అమలు చేయాలని, రూ.20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని, 2 లక్షల గ్రాట్యుటీ విధానాన్ని ఎత్తివేసి యాక్టు ప్రకారం చెల్లించాలన్నారు. ఉద్యోగుల సమ్మెకు కమ్యూనిస్టు నేత ఎస్కె ఖాశీం మద్దతు తెలిపారు. కార్యక్రమంలో మహబూబ్బాషా, మహమ్మద్ రఫీ, శ్రీకాంత్ రెడ్డి, శేషిరెడ్డి, రంగయ్య, ఎర్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సహకార ఉద్యోగుల అర్ధనగ్న ప్రదర్శన


