సీఎం పర్యటనకు భారీ బందోబస్తు
● ఇన్చార్జి ఎస్పీ హర్షవర్థన్రాజు వెల్లడి
మార్కాపురం టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం మార్కాపురం, పెద్దదోర్నాల మండలంలో పర్యటిస్తున్న సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మార్కాపురం జిల్లా ఇన్చార్జి ఎస్పీ హర్షవర్థన్రాజు తెలిపారు. ఇద్దరు ఏఎస్పీలు, 9 మంది డీఎస్పీలు, 37 మంది సీఐలు, 90 మంది ఎస్సైలతోపాటు 1162 మంది హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, ఏఆర్ పోలీసులు, ఏపీఎస్పీ సిబ్బందిని బందోబస్తుకు నియమించినట్లు వివరించారు. పోలీసులు సూచించిన విధంగా వాహనదారులు పార్కింగ్ ప్లేసుల్లో మాత్రమే తమ వాహనాలు నిలపాలని సూచించారు. హెలిప్యాడ్, సభాస్థలిని అధికారులతో కలిసి ఎస్పీ పరిశీలించారు. అనంతరం ట్రయల్ రన్ నిర్వహించారు. ఎస్పీ వెంట ఎస్ఎస్జీ అడిషనల్ ఎస్పీ రమణ, నెల్లూరు అడిషనల్ ఎస్పీ సౌజన్య, పల్నాడు అడిషనల్ ఎస్పీ సత్యరాజు, డీఎస్పీలు ఉన్నారు.
పెద్దదోర్నాల: ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం పెద్దదోర్నాల మండలంలోని గంటవానిపల్లెలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఇక్కడి హెలిప్యాడ్ వద్ద బందోబస్తు విధుల్లో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ ఎండ తీవ్రతకు స్పృహ తప్పి అస్వస్థతకు గురైంది. గంటవానిపల్లె ఫీడర్ కెనాల్ సమీపంలో హెలిప్యాడ్ను మంగళవారం మార్కాపురం జిల్లా ఇన్చార్జి ఎస్పీ హర్షవర్థన్రాజు పరిశీలిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎస్పీ ఆదేశాల మేరకు అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు పోలీసు వాహనంలో మహిళా కానిస్టేబుల్ను పెద్దదోర్నాల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. నీరసం వల్ల కళ్లు తిరిగి పడిపోయారని, ఆమె పరిస్థితి నిలకడగా ఉందని సహచర ఉద్యోగులు పేర్కొన్నారు.
సీఎం పర్యటనకు భారీ బందోబస్తు


