వలేటివారిపాలెంలో గుప్త నిధుల తవ్వకాలు
వలేటివారిపాలెం: మండల కేంద్రమైన వలేటివారిపాలెంలో గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. సోమవారం అర్ధరాత్రి వేళ స్థానికంగా ఉన్న పురాతనమైన జనార్దన స్వామి గుడి ఆవరణలో నాలుగు స్తంభాల కల్యాణ మండపంలో సుమారు 11 అడుగుల లోతున గొయ్యి తవ్వారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం వెలుగుచూసింది. స్థానికుల కథనం మేరకు.. ఆలయ ఆవరణలో గొయ్యి తవ్వి ఉండటాన్ని గ్రామానికి చెందిన పశుపోషకాలు గమనించి గ్రామ పెద్దలకు తెలియజేశారు. రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన జనార్దన ఆలయం ఆవరణలో 200 అడుగుల ఎత్తు గల రాతి స్తంభం వద్ద కల్యాణ మండపం ఉంది. గతంలో కూడా గుప్త నిధుల కోసం ఇదే గుడిలో ఒక సారి, రాతి స్తంభం కింద ఒకసారి తవ్వకాలు చేపట్టారు. ఇప్పటికై నా ప్రభుత్వం, పురావస్తు శాఖ అధికారులు స్పందించి జీర్ణావస్థకు చేరిన ఆలయానికి మరమ్మతులు చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గుప్త నిధుల తవ్వకాలకు పాల్పడిన ముఠాను అరెస్టు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.


