
పీఈటీపై కేసు నమోదుకు టీడీపీ నేతల అడ్డుపుల్ల!
ఒంగోలు టాస్క్ఫోర్స్: సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం జెడ్పీ హైస్కూల్లో ఓ బాలికను లైంగికంగా వేధించిన వ్యాయామ ఉపాధ్యాయుడు పిల్లి హజరత్తయ్య సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. అతనిపై పోక్సో కేసు నమోదు చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించినా పోలీసులు మీనమేషాలు లెక్కిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 19వ తేదీ సాయంత్రం పీఈటీపై ఫిర్యాదు చేయడానికి డీవైఈఓ చంద్రమౌలీశ్వరరావు సింగరాయకొండ పోలీస్స్టేషన్కు వెళ్లారు. ఏమైందో ఏమో కానీ ఫిర్యాదు చేయకుండానే వెనుదిరిగారు. దీనిపై విద్యాశాఖ, పోలీసులను వివరణ కోరగా భిన్నమైన సమాధానాలివ్వడం అనుమానాలకు తావిస్తోంది.
డీవైఈఓ మాట్లాడుతూ.. తాను 19వ తేదీ రాతపూర్వకంగా అర్జీ తీసుకెళ్తే పోలీసులు టైప్ చేయించి ఇవ్వాలని సూచించారన్నారు. కంప్యూటర్లో టైప్ చేయించుకుని వెళ్తే సీఐ హజరత్తయ్యకు ఇవ్వాలనడంతో రాత్రి 8.30 గంటల వరకు వేచిచూసి వెనుదిరిగానని చెప్పారు. ఎస్సై బి.మహేంద్ర మాట్లాడుతూ.. ఊళ్లపాలెం పీఈటీపై ఫిర్యాదు చేయడానికి డీవైఈఓ రాగా కొన్ని వివరాలు అడిగామని, సమాచారం లేకపోవడంతో కలెక్టర్తో మాట్లాడి మళ్లీ వస్తానని వెళ్లిపోయారని చెప్పారు. ఇదిలా ఉండగా.. మంత్రి స్వామితో మాట్లాడిన తర్వాతే కేసు నమోదు చేయాలని అప్పటి వరకు ఎలాంటి చర్యలు వద్దని అధికార పార్టీ నాయకులు కొందరు ఎస్సైపై ఒత్తిడి తెచ్చారని బీసీ సంఘ నాయకుడు పొటికలపూడి జయరాం ఆరోపించారు.
మర్రిపాలెం(విశాఖ జిల్లా): ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన కారులో గంజాయిని గుర్తించిన పోలీసులు, ఆ కేసులో పరారీలో ఉన్న మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ విషయాన్ని గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఐదో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ రవికుమార్ వెల్లడించారు. ఈ నెల 12న సుభాష్నగర్ వద్ద జరిగిన ప్రమాదంలో ఒక కారు ఢీకొని ఏడాదిన్నర చిన్నారి వర్షిత్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత కారు డ్రైవర్, తమిళనాడుకు చెందిన అర్జునన్ జెమినీ అధ్ముఘంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు కారులో ఉన్న మరో ముగ్గురు పరారయ్యారు. పోలీసులు ఈ నెల 16న సీజ్ చేసిన కారును తనిఖీ చేయగా.. అందులో 21 కిలోల గంజాయిని గుర్తించారు. విచారణలో భాగంగా పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో హైదరాబాద్లోని హాస్టల్లో ఉంటున్న గుంటూరుకు చెందిన 20 ఏళ్ల అక్షయ గౌతమి, ఒంగోలుకు చెందిన 25 ఏళ్ల పెర్లి విజయవర్ధన్ రాజు, గుంటూరుకు చెందిన 19 ఏళ్ల షేక్ మహమ్మద్ జాకీర్ ఉన్నారని సీఐ తెలిపారు. ఈ నలుగురు విజయవాడలో కారు అద్దెకు తీసుకుని అరకు వెళ్లి అక్కడ గంజాయి కొనుగోలు చేశారు. తిరిగి వస్తుండగా ఊర్వశి జంక్షన్ సమీపంలోని సుభాష్నగర్ వద్ద ప్రమాదం జరిగింది. నిందితుల్లో ఒకరైన పెర్లి విజయవర్ధన్ రాజుపై ఇప్పటికే ఒంగోలులో 11 కేసులు ఉన్నాయని, మరొక నిందితుడు మహమ్మద్ జాకీర్పై కూడా గంజాయి కేసు ఉందని పోలీసులు వెల్లడించారు. యువతికి తల్లిదండ్రులు లేరు. విజయవర్ధన్కు బంధువు కావడంతో అతనితో ఇలా వెళ్తూ ఉంటుంది. ఈ కేసులో ప్రతిభ చూపించిన ఎస్ఐలు షేక్ సమీర్, రవికుమార్లను సీఐ అభినందించారు.
ఊళ్లపాలెం జెడ్పీ హైస్కూల్ పీఈటీపై పోక్సో కేసు నమోదుకు కలెక్టర్ ఆదేశించినా స్పందన శూన్యం0
మంత్రి డోలాతో చర్చించాకే కేసు కట్టాలని
టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు