
తాడేపల్లి : లిక్కర్ స్కామ్ ను వైఎస్సార్ సీపీ పై మీద వేసి తాము రాష్ట్రాన్ని దోచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎత్తుగడ వేశారని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. అసలు లిక్కర్ స్కామ్ జరిగిందే చంద్రబాబు హయాంలోనని, 2014 19లో లిక్కర్ స్కామ్ జరిగిందని సీఐడీ చంద్రబాబు మీద కేసు పెట్టిన విషయాన్ని టీజేఆర్ ప్రస్తావించారు.
తాడేపల్లి వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. ‘ ఆ లిక్కర్ స్కామ్ కేసులో చంద్రబాబు ఏ 3గా ఉన్నారు. దాని గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు?, టీడీపీ నేతలకు చెందిన డిస్టిలరీలకు అడ్డదిడ్డంగా కాంట్రాక్టులు ఇచ్చారు. ఇందుకోసం ఎక్సైజ్ పాలసీనే చంద్రబాబు మార్చారు. ప్రభుత్వానికి రావాల్సిన రూ.2,984 కోట్లు తమవారి జేబుల్లోకి వేసుకున్నారు. ఈ పాలసీ ద్వారా ప్రభుత్వానికి నష్టం, టీటీడీ నేతలకు లాభం జరిగింది. ఆ స్కామ్ గురించి మాట్లాడటం లేదు.
2019లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పట్నుంచి పోలింగ్ మధ్యలో అనేక డిస్టలరీలకు ఎందుకు అనుమతులు ఇచ్చారు?, క్యాబినెట్ కు తెలియకుండానే నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారో చెప్పాలి. బార్లకు మేలు చేస్తూ అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వెనుక కారణం ఏమిటి?, వీటిన్నంటిపై విచారణ చేస్తే అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. లిక్కర్ కేసులో కీలకంగా ఉన్నాడంటూ వాసుదేవరెడ్డి మీద నాలుగు కేసులు పెట్టారు.
కాగితాలపై సంతకాలు పెట్టించుకుని రిలీవ్ చేయటం వెనుక కారణం ఏంటి?, ఈ అక్రమ కేసులు పెట్టడం ద్వారా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అధికారులు గుర్తుంచుకోవాలి. ఇష్టానుసారం చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి లిక్కర్ పాలసీతో ఏం సంబంధం ఉంది?, చిత్తూరులో చంద్రబాబుకు ప్రత్యర్థిగా ఉన్నందున అక్రమ కేసులు పెట్టి వేధిస్తారా?, కసిరెడ్డి రాజశేఖరరెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. నిజంగా కేసిరెడ్డికి లిక్కర్ పాలసీ గురించి తెలిసి ఉంటే బేవరేజ్ కార్పోరేషన్ లో పదవి ఇచ్చేవాళ్లం కదా? , ఆయన ఐటీకి సంబంధించి సలహాదారుడు మాత్రమే. చంద్రబాబు, జగన్ హయాంలో లిక్కర్ పాలసీలపై చర్చకు మేము సిద్ధం. ప్రజలు పడుతున్న కష్టాలపై ఎల్లోమీడియా ఎందుకు చర్చలు పెట్టటం లేదు?
పులివెందుల ఎమ్మెల్యే పదవిని రద్దు చేసి తిరిగి గెలిచే దమ్ముందా?, ఎన్నికలలో పోటీ చేసే సత్తా టీడీపీ కి ఉందా?, చంద్రబాబు సాధించిన ఘనత వైన్ షాపులు, పర్మిట్ రూములు పెట్టడమే. అధిక ధరలకు మదగయం అమ్ముతుంటే ఒక్క కేసు కూడా ఎక్సైజ్ శాఖ ఎందుకు నమోదు చేయలేదు? , విజయసాయిరెడ్డి ఎవరితోనో కమిట్ అయ్యారు. అందుకే మాపై ఆరోపణలు చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు టీజేఆర్.