
వైఎస్ జగన్పై అవాకులు చవాకులు పేలితే గట్టిగా బుద్ధి చెబుతాం
చంద్రబాబు ప్రాపకం కోసమే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు
వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రాపకం కోసమే డొక్కా మాణిక్య వరప్రసాద్(Dokka Manikya Vara Prasad) వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్(YS Jaganmohan Reddy), పార్టీ నేతల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు(Kommuri Kanakarao) చెప్పారు. డొక్కా నోరు అదుపులో పెట్టుకోకపోతే గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
ఆయన ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలు మారే అలవాటున్న డొక్కా, వెన్నుపోట్లు గురించి.. అది కూడా వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీలో ఉండి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. డొక్కాను రాజకీయ వ్యభిచారి అని అనాలని ఉన్నా ఆయన వయసును చూసి గౌరవం ఇస్తున్నామని చెప్పారు. చంద్రబాబు మెప్పుకోసం డొక్కా చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే మంత్రిగా పనిచేసింది ఈ వ్యక్తేనా అని సందేహం కలుగుతోందన్నారు. చంద్రబాబుకి కూడా డొక్కా వ్యవహారం తెలుసు కాబట్టే ఏ పదవీ ఇవ్వకుండా పక్కన పెట్టేశారని చెప్పారు.
జగన్ అన్నం పెట్టడంలేదని విజయమ్మ ఏమైనా డొక్కాకు ఫోన్ చేసి చెప్పారా అని మండిపడ్డారు. వైఎస్ జగన్పై అవాకులు చవాకులు పేలితే ఊరుకోబోమని హెచ్చరించారు. దళిత కార్డును అడ్డం పెట్టుకుని ఏది మాట్లాడినా చెల్లుతుందనుకుంటే పొరపాటేనని చెప్పారు. ఈ రాష్ట్రంలో దళితులకు న్యాయం జరిగింది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అని తెలిపారు. వైఎస్ జగన్ 5 మంది దళితులకు మంత్రి పదవులు ఇచ్చారని, 15 మంది ఎస్సీలను కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించారని తెలిపారు. డొక్కాకు చేతనైతే సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును ప్రశ్నించాలని కనకారావు చెప్పారు.