YS Sharmila Nirudyoga Nirahara Deeksha At Indira Park, Details Inside - Sakshi
Sakshi News home page

YS Sharmila Deeksha: నేను ఎందుకు వెనక్కి తగ్గాలి?: వైఎస్ షర్మిల

Published Wed, Apr 26 2023 3:15 PM

YS Sharmila Nirudyoga Nirahara Deeksha At Indira Park - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌టీపీ ఆధ్వర్యంలో ‘టీ–సేవ్‌’ నిరుద్యోగ దీక్షను ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బుధవారం ఇందిరాపార్కు వద్ద చేపట్టారు. ఈ దీక్షలో ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు పాల్గొన్నాయి.

ఈ సందర్భంగా వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ, ‘‘నేను ఎందుకు వెనక్కి తగ్గాలి. రాజకీయాలంటేనే చీదరించుకునే దానిని.. మాకు పోలీసులతో గొడవ పెట్టుకోవడానికి ఏం అవసరం. తెలంగాణ యువత కోసం పోరాడుతున్నా. నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తేవడానికి వైఎస్‌ హయాంలో పోలీసులు పనిచేశారు. సెల్ఫ్‌ డిఫెన్స్‌లో చేశాను తప్ప.. పోలీసులను కించపరచాలని కాదు’’ అని పేర్కొన్నారు.

‘‘బంగారు తెలంగాణ ఎక్కడ?. కల్వకుంట్ల కుటుంబం బంగారు తెలంగాణగా మారింది. సిట్‌ విచారణ కొండను తవ్వి ఎలుకను పట్టే విధంగా ఉంది. సిట్‌ విచారణలో సూత్రధారులను వదిలేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ప్రభుత్వ శాఖల్లో సమాచారం తీసుకోవడం అంత సులభమా?. ఐపీ అడ్రస్‌, పాస్‌వర్డ్‌ తెలిస్తే చాలా?. కేటీఆర్‌ తనకేమీ సంబంధం అంటున్నారు. ఐటీశాఖ బాధ్యతలు ఏంటో మీకు తెలుసా?. ఐటీ చట్టం-2000 వరకు అన్ని శాఖల్లో వాడే కంప్యూటర్లకు ఐటీ శాఖదే బాధ్యత. 2018లో టీఎస్‌పీఎస్సీలో కంప్యూటర్లు కొన్నారు.. ఐటీశాఖ సైబర్‌ సెక్యూరిటీ ఆడిట్‌ ఎప్పుడైనా చేసిందా?’’ అని షర్మిల ప్రశ్నించారు.

‘‘సైబర్‌ సెక్యూరిటీ ఆడిట్‌ జరిగి ఉంటే పేపర్‌ లీకేజీ జరిగేది కాదు. సిట్‌ అధికారులను ప్రగతిభవన్‌ గుప్పెట్లో పెట్టుకున్నారు. తీగలాగితే ఐటీ డొంక కదులుతుంది. కేటీఆర్‌ను కాపాడటానికే సిట్‌ ప్రయత్నం చేస్తుంది. దమ్ముంటే సీబీఐ దర్యాప్తు కోరండి. కేసీఆర్‌కు 10 ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రం పంపుతున్నా’’ అని షర్మిల అన్నారు.
చదవండి: TS: వాతావరణశాఖ హెచ్చరిక.. ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన

Advertisement
Advertisement