ఫామ్‌ హౌస్‌ కేసులో ఆడియో, వీడియోలు అబద్ధమా?: బీజేపీ నేతలపై తలసాని ఫైర్‌

Talasani Srinivas Yadav Serious Comments On Kishan Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ నేతలను టార్గెట్‌ చేస్తూ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి తలసాని బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఫామ్‌హౌస్‌ కేసుతో సంబంధంలేదని ఇప్పుడు ఎందుకు సంబురపడిపోతున్నారు?. మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడిన తీరు అనుమానాలకు తావిస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆడియో, వీడియోలు అబద్ధమా?. 

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అమావాస్య, పౌర్ణమి ఒకసారి హైదరాబాద్‌కు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. హైదరాబాద్‌లో అభివృద్ధిపైన ఇష్టం వచ్చినట్లు ​కామెంట్స్‌ చేస్తున్నారు. కేంద్రం నుండి హైదరాబాద్‌కు ఏం తెచ్చారో చెప్పాలి. హైదరాబాద్ విషయం పక్కన పెట్టు.. ఆయన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో చేసిన అభివృద్ధి పని ఏంటో చెప్పాలి?. ఏది పడితే అది మాట్లాడొద్దు. నా జీవితంలో ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎక్కడా చూడలేదు. 

తెలంగాణ ప్రభుత్వం ఇంత ఖర్చు పెడుతోంది. కేంద్రం కొంత సహాయం చేస్తోంది అని చెప్పాలి. కానీ, ఎంతసేపు తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఫామ్‌హౌస్‌ కేసులో ముందుగా కోర్టుకు వెళ్లింది మేరే కదా. మీ తప్పు లేనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్లారు. కేసు సిట్‌ నుండి సీబీఐకి మాత్రమే కోర్టు బదిలీ చేసింది. అంతేగానీ.. క్లీన్‌ చీట్‌ ఏమీ ఇవ్వలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top